చంద్రబాబు కసరత్తు: ఫలితాల పై స్పష్టత : 10న కీలక సమావేశం..
Recommended Video
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన కసరత్తు వేగవంతం చేసారు. జాతీయ స్థాయిలో సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఎన్నికల ఫలితాల పై ఆయన ఓ అంచనా కు వచ్చారు. ఇదే సమయంలో తాను బిజెపి వ్యతిరేక కూటమి ని కూడగట్టే పనిలో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. గతంలో మమతా సూచన మేరకు వాయిదా పడిన కూటిమ నేతల సమావే శాన్ని కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం ముహూర్తం ఖరారు చేయటంతో పాటుగా స్వయంగా బాబు ఫోన్ చేసి వారిని సమావేశానికి ఆహ్వానిస్తున్నారు......
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి చూపించారు. ఓటింగ్ జరుగుతున్న సమయంలోనే పోలింగ్ సరళి తెలుసుకోవటంతో పాటుగా.. సాయంత్రానికి ఫలితాల పై అంచనాకు వచ్చారు. ఏది ఎలా ఉన్నా..బిజెపి పై పోరాటం విషయంలో వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నారు. ఇతర రాష్ట్ర ఎన్నికల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను ఆరా తీసారు. ఇదే సమయంలో..జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి కార్యాచరణ ఖరారు చేయటంతో పాటుగా సమర్ధవంతమైన ప్రణాళిక సిద్దం చేయాలని భావిస్తున్నారు. తొలుత సమావేశం ఏర్పాటు చేస్తే నేతల అభిప్రాయాలు తెలుసుకోవటంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ పై ఓ రూపు వస్తుందని టిడిపి ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇందు కోసం తాను ఇప్పటికే సంప్రదింపులు జరిపిన నేతలకు స్వయంగా ఫోన్ చేసారు చంద్రబాబు..
10న కీలక సమావేశం..
బిజెపిని వ్యతిరేకించే పార్టీ నేతలతో ఈ నెల 10న ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు భాజపాయేతర పక్షాల అగ్రనేతలతో ఫోన్లో మాట్లాడారు. చంద్రబాబు ఫోన్ చేసిన వారిలో మాజీ ప్రధాని దేవేగౌడ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతాబెనర్జీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, వామపక్షాల అగ్రనేత లు ఉన్నారు. వారితో తాజా రాజకీయ పరిణామాల పై చర్చించారు. సమావేశానికి హాజరవటానికి అందరూ అంగీకరించారు. భాజపా వ్యతిరేక పక్షాలను ఒక వేదికపైకి తీసుకురావటమే ప్రాథమికంగా ఈ భేటీ లక్ష్యం. దీనికి అనుగుణంగానే జాతీయ నేతలతో ఫోన్ సంభాషణల్లో ప్రస్తావించినట్లు తెలిసింది. అజెండా గురించి ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదని సమాచారం. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాలతోపాటు కేరళ సీఎం విజయన్, కాంగ్రెస్ సీఎంలు అమరీందర్సింగ్, నారాయణసామిలతో శని, ఆదివారాల్లో చంద్రబాబు మాట్లాడి వారిని సమావేశానికి ఆహ్వానించనున్నారు.