ఏపీ బీజేపీలో మరో వికెట్: మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిపై సోము వీర్రాజు ఫైర్: సస్పెన్షన్ వేటు
మచిలీపట్నం: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖలో మరో వికెట్ పడింది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును ప్రకటించిన తరువాత ఆరంభమైన సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. పార్టీ సిద్ధాంతాలకు ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడినా సహించేది లేదంటూ ఇప్పటికే సస్పెన్షన్ల వేటును వేసిన పంపించిన సోము వీర్రాజు.. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపైనా అదే తరహా శిక్షను అమలు చేస్తున్నారు. పార్టీ కట్టుబాట్లను తప్పిన వారిని ఇంటికి సాగనంపుతున్నారు. తాజాగా మరో నాయకుడిపైనా సస్పెన్షన్ వేటు పడింది.
తాజాగా- కృష్ణాజిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు గుడివాక రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబు.. 2019 లోక్సభ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ దొరికిపోయారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలించిన కేసులో గుడివాకను స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి ఆరు లక్షల రూపాయల విలువ చేసే 1920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో గుడివాకపై పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మచ్చా సురేశ్, నరేశ్, గంటా హరీశ్ను అరెస్ట్ చేశారు. దీనిపై సోము వీర్రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసు నమోదైన రోజే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఆయన చర్యలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ నేతలు పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని వదిలి పెట్టమని అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ క్రమశిక్షణ చర్యలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు.

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి సోము వీర్రాజు పేరును ఖరారు చేసిన తరువాత సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్న వారిలో గుడివాక రామాంజనేయులు మూడో వ్యక్తి. ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు ఓవీ రమణపై వేటు పడింది. అమరావతికి అనుకూలంగా రైతులు నిర్వహిస్తోన్న ఆందోళనల్లో పాల్గొన్న వెలగపూడి గోపాలకృష్ణనూ పార్టీ నుంచి సాగనంపారు. వారిద్దరిపైనా క్రమశిక్షణ నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకున్నారు. అమరావతికి అనుకూలంగా టీవీ డిబేట్లలో పాల్గొంటూ వచ్చిన లంకా దినకర్ సహా మరికొందరికి షోకాజ్ నోటీసులను జారీ చేశారు.












Click it and Unblock the Notifications