ఏపీ కేబినెట్లో అనూహ్య మార్పులు? ఉత్తరాంధ్రకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు?
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖాయమైంది. శ్రావణమాసం ఆరంభంలోనే మంత్రివర్గం విస్తరణకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బుధవారం కేబినెట్ విస్తరణ చేపట్టారు. రెండు కొత్త ముఖాలను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు సీదిరి అప్పలరాజు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. వారి పేర్లు దాదాపు ఖరారైనట్టేనని సమాచారం.
అదే సమయంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్కు ప్రమోషన్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న ఆయనను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారని అంటున్నారు. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ధర్మాన కృష్ణదాస్కు ప్రమోషన్ ఇవ్వొచ్చని అంటున్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖాళీ చేసిన ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన సామాజిక వర్గానికే చెందిన ధర్మాన కృష్ణదాస్తో భర్తీ చేస్తారని అంటున్నారు. ధర్మానతో పాటు తూర్పు గోదావరి జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేరు కూడా వినిపిస్తోంది.
ధర్మాన కృష్ణదాస్కు ప్రమోట్ చేస్తే.. ఉత్తరాంధ్ర ప్రాంతానికే రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినట్టవుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలపై పార్టీకి ఉన్న పట్టు మరింత బలపడుతుందని అంటున్నారు. బీసీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఉత్తరాంధ్ర ఓటుబ్యాంకు భవిష్యత్తులో చెక్కు చెదరకపోవచ్చనేే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలుగా గుర్తింపు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధికి అవకాశం కల్పించినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఉత్తరాంధ్ర ప్రాంతానికే రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు అనే అంశం వల్ల మైనస్సులు కూడా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ధర్మాన కృష్ణదాస్కు కేబినెట్లో పదోన్నతి కల్పించడమంటూ జరిగితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను ఇచ్చినట్టవుతుందని, ఇది మంత్రివర్గ కూర్పును దెబ్బతీయొచ్చనే వాదనలు సైతం లేకపోలేదు. కేబినెట్లో సమతౌల్యాన్ని కోల్పోయే అవకాశం ఉందనే అనుమానాలు కూడా వైసీపీ నాయకుల నుంచి వ్యక్తమౌతున్నాయి.
Recommended Video
ఉత్తరాంధ్రకే చెందిన విజయనగరం జిల్లా కురుపాం శాసన సభ్యురాలు పుష్పా శ్రీవాణి ప్రస్తుతం కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటకు చెందిన ధర్మాన కృష్ణదాస్కు డిప్యూటీగా పదోన్నతి కల్పించడం వల్ల ప్రాంతీయ అసమానతలు తలెత్త వచ్చనీ అంటున్నారు. వైఎస్ జగన్ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ధర్మానకు బదులుగా కురసాల కన్నబాబును పేరును ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.