పీఆర్సీ ఆందోళనల మధ్య.. గవర్నర్ బిశ్వభూషణ్తో వైఎస్ జగన్ భేటీ
విజయవాడ: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన వివాదం నడుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సారథ్యంలోని అధికారుల కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేసిన పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తోన్నారు. 14.29 శాతం ఫిట్మెంట్ను నిర్ధారించిందీ కమిటీ. దీన్ని అంగీకరించబోమని, తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తోన్నాయి.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించినా పెద్దగా ఫలితం కనిపించట్లేదు. ఈ పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలుసుకోనున్నారు. ఈ సాయంత్రం 5: 30 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్తారు. రాజ్భవన్లో గవర్నర్తో భేటీ కానున్నారు. ఈ సమయంలో వైఎస్ జగన్ వెంట ఆయన భార్య భారతి కూడా ఉంటారు. ఇది మర్యాదపూరక సమావేశంగా అధికారులు చెబుతున్నారు.

సుమారు అరగంట పాటు వారి మధ్య సమావేశం కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ బిశ్వభూషణ్ కొద్దిరోజుల కిందటే తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆయన ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. పూర్తిగా కోలుకున్న తరువాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు. రాజ్భవన్కు చేరుకున్నారు. విశ్రాంతి తీసుకుంటోన్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం, పరామర్శించడం కోసం వైఎస్ జగన్, తన భార్య భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లనున్నారు. గవర్నర్, ఆయన భార్య సుప్రవ హరిచందన్ను కలుసుకుంటారు. ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకుంటారు. వారిద్దరి మధ్య సమావేశానికి పాలనాపరమైన ప్రాధాన్యత లేదని అధికారులు చెబుతున్నారు. మర్యాదపూరక భేటీగా స్పష్టం చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, రాజ్భవన్కు చేరుకున్న తరువాత గవర్నర్ను వైఎస్ జగన్ కలుసుకోవడం ఇదే తొలిసారి అవుతుంది.
కాగా- ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలను వైఎస్ జగన్.. గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని చెబుతున్నారు. ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయాల గురించి వివరిస్తారని సమాచారం. పీఆర్సీ నివేదికపైనా ఆయనకు వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ కానున్నందున.. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లొచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications