కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్: నిరుద్యోగులకు కూడా
విజయవాడ: కాంట్రాక్టు ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ అమోదించిన బిల్లుకు గెజిట్ను గవర్నర్ జారీ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల చిరకాల వాంఛను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు.
సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తాజా ఉత్తర్వులతో వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్టైం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యూలరైజ్ అయ్యారు. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2-6-2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్ సడలించిన విషయం తెలిసిందే.

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏపీ గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా జీవో విడుదల చేసింది. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
అయితే, పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల అభ్యర్థనకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సీఎం ఆదేశాలతో అన్ని విభాగాలను మరోసారి ఖాళీల వివరాలను తెప్పించుకున్న జీఏడీ.. పరిశీలన తర్వాత అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేయనుంది.












Click it and Unblock the Notifications