నో కాంప్రమైజ్ : గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీకి ముందే: ప్రభుత్వం కొత్త ట్విస్ట్..!!
రాష్ట్ర ఎన్నకల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించటం పైన కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పైన సుప్రీం లో అప్పీల్ కు వెళ్లిన ఏపీ ప్రభుత్వం..ఇప్పుడు తాజాగా మరో పిటీషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం అమలు చేయటం లేదంటూ రమేష్ కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. దాని పైన విచారణ సమయంలో హైకోర్టు నిమ్మగడ్డకు కీలక సూచనలు చేసింది. ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాటుగా గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని సూచించింది. దీంతో..వెంటనే ప్రభుత్వం గవర్నర్ వద్దకు నిమ్మగడ్డ వెళ్లకముందే సుప్రీంలో గత కేసుకు అనుబంధంగా మరో పిటీషన్ దాఖలు చేసింది. ఇంతకీ ప్రభుత్వం ఆ పిటిషన్లో ఏమని పేర్కొంది..?

చర్యలన్నీ నిలిపివేయండి...
నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించటం లేదు. హైకోర్టు తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగా రావటంతో..దీని పైన సుప్రీంని ఆశ్రయించిన ప్రభుత్వం..అక్కడ తీర్పు కోసం వేచి చూస్తోంది. ఇదే సమయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో ఒకవైపు విచారణ పెండింగ్ లో ఉండగానే మరో వైపు హైకోర్టు కోర్టు ధిక్కరణ పిటీషన్ పైన విచారణ జరపటం సరికాదంటూ ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొంది. హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటీషన్ లో తదుపరి చర్యలన్నీ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆ పిటీషన్ లో సుప్రీంను కోరింది.

స్పెషల్ లీవ్ పిటిషన్ నిరర్థకం
హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తే సుప్రీంకోర్టు ముందు తాము దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ నిరర్ధకం అవుతుందని ప్రభుత్వం పిటీషన్ లో కోర్టుకు నివేదించింది. ఎన్నికల కమిషనర్ ను గవర్నర్ నియమించాలనన హైకోర్టు తీర్పు చెల్లుబాటు కాదనేందుకు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని అందులో వివరించింది. ఇక, ఈ నెల 8న తమ ఎస్ఎల్పీ విచారణకు వచ్చిన సమయంలో నాలుగు వారాల తర్వాత తుది విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు చెప్పిందని ప్రభుత్వం ఈ పిటీషన్ లో గుర్తు చేసింది.

గవర్నర్ వైపే అందరి చూపు..
హైకోర్టు రెండు రోజుల క్రితం నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణలో భాగంగా.. గవర్నర్ వద్దకు వెళ్లి తమ ఆదేశాలు అమలు చేసే విధంగా వినతి పత్రం ఇవ్వాలని నిమ్మగడ్డకు సూచించింది. దీని మేరకు గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ ఖరారైంది. ఇదే సమయంలో ప్రభుత్వం సుప్రీంలో అనుబంధ పిటీషన్ దాఖలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పరోక్షంగా హైకోర్టు ధిక్కరణ పిటీషన్ ఆధారంగ ఎటువంటి తదుపరి ఉత్తర్వులు ఇవ్వకుండా ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించినట్లుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే, సుప్రీం స్టే ఇవ్వనంత వరకూ తమ ఆదేశాలు అమల్లో ఉంటాయనే విషయం హైకోర్టు స్పష్టంగా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పైన ఆసక్తి నెలకొని ఉంది. ఇక, ఇదే సమయంలో ఈ పిటీషన్ ప్రభుత్వం దాఖలు చేసిన తరువాత..అటు హైకోర్టు సూచనల నడుమ నిమ్మగడ్డ గవర్నర్ తో భేటీ అయ్యే సమయంలో ఎటువంటి చర్చ జరుగుతోంది..గవర్నర్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది












Click it and Unblock the Notifications