ఏపీలో పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదన్న ప్రభుత్వం- ఎస్ఈసీ చెప్పాలన్న హైకోర్టు...
ఏపీలో కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. దీనిపై స్పందించిన న్యాయస్ధానం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయం కోరింది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కూడా కోరుతూ నోటీసులు జారీ చేసింది.
కరోనా కారణంగా రాష్ట్రంలో స్ధానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాద హైకోర్టుకు తెలిపారు. కరోనా ప్రభావం కొనసాగుతుండగానే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగతుండగా ఏపీలో ఎందుకు నిర్వహించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. కరోనాతో ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేదనే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పాలని హైకోర్టు తెలిపింది. ఇదే అంశంపై తమ అభిప్రాయం తెలపాలని ఎస్ఈసీని ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
Recommended Video
ఈ ఏడాది మార్చి నెలలో కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇందులో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం స్ధానిక ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయడంపై ఆగ్రహంతో ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ను ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ ఉద్వాసన పలికింది. ఆయన స్ధానంలో జస్టిస్ కనగరాజ్ను కొత్త ఎస్ఈసీగా నియమించింది. ఆ తర్వాత ఈ నిర్ణయాలను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయి. దీంతో తిరిగి నిమ్మగడ్డ ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై తాజా పరిస్దితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఆయన ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు త్వరలో ఓ అఫిడవిట్ సమర్పించనున్నారు.