రైతులతో నిరసన ఎందుకు చంద్రబాబు, ‘అభివృద్ధి’కామెంట్లపై బొత్స సత్యనారాయణ ఫైర్
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం వల్ల అభివృద్ధి జరగదని చంద్రబాబు అంటున్నారని గుర్తుచేశారు. అలాంటప్పుడు రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఎందుకు ఆందోళన చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు కపటనీతిని ప్రజలు గమనించాలని బొత్స సత్యనారాయణ కోరారు.
జై అమరావతి..రాజధాని ఇక్కడే ఉండాలి: విశాఖకు వ్యతిరేకం కాదు: అండగా ఉంటాం.. చంద్రబాబు హామీ!
నిరసన ఎందుకు?
రాష్ట్రాభివృద్ధి కంపెనీలు, పరిశ్రమల వల్ల అని చంద్రబాబు చెప్తున్నారని బొత్స గుర్తుచేశారు. అయితే నిరసన చేయడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించారు. రాజధానికి కేవలం 5 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని బొత్స విమర్శించారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు రాజధాని మార్పు అంశం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం కులానికి, మతానికి కొమ్ముకాయదని తేల్చిచెప్పారు.
ఆమడదూరం
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అభివృద్ధి ఎందుకు జరగలేదని బొత్స ప్రశ్నించారు. తన అనుయాయులకు భూములు కట్టబెట్టేందుకే చంద్రబాబు సమయం కేటాయించారని విమర్శించారు. బాలకృష్ణ చిన్న అల్లుడికి 500 ఎకరాల భూమి కేటాయించలేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పరిశ్రమల కోసం కేటాయిస్తే ఓకే కానీ.. ఆ 500 ఎకరాల భూమిని సీఆర్డీఏ పరిధిలో చేర్చడం మాత్రం సరికాదని బొత్స అన్నారు.
దోపిడీ
గత ప్రభుత్వ హయాంలో దోపిడీ చేసి, ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారా అని మండిపడ్డారు. ప్రజలను కూడా మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. తాత్కాలిక శాసనసభ అమరావతిలో కొనసాగుతుందని బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. అమరావతిని ఎడ్యకేషన్ హబ్గా మారుస్తామని చెప్పారు. విశాఖ వేసవి కాల రాజధానిగా ఉంటుందని.. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి, విశాఖపట్టణంలో కూడా బెంచ్లు ఉంటాయని పేర్కొన్నారు.