నిమ్మగడ్డ పదవీకాలం పొడిగింపు ? మరో రెండు నెలలు- కలిసొస్తున్న ఈక్వేషన్ ఇదే
ఏపీలో స్ధానిక సంస్ధల నిర్వహణ విషయంలో జగన్ సర్కారుతో ముఖాముఖీ పోరు సాగించి గెలిచిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే ఊపులో ప్రభుత్వానికి మరో షాక్ ఇవ్వబోతున్నారా ? పంచాయతీ ఎన్నికల తర్వాత ఇక మిగిలి ఉన్న ఎంపీటీపీ, జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను కూడా పూర్తి చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారా ? ఇందుకోసం తన పదవీకాలాన్ని సైతం పొడిగించుకునేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

జగన్ సర్కారుకు నిమ్మగడ్డ మరో షాక్
ఏపీలో గతేడాది స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదాతో జగన్ సర్కారుకు భారీ షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషనర్ అప్పటి నుంచి సర్కారుతో ముఖాముఖీ పోరు సాగిస్తున్నారు. ప్రభుత్వం ఆయన్ను అత్యవసర ఆర్డినెన్స్తో పదవి నుంచి తొలగించినా హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ పదవి కాపాడుతున్న నిమ్మగడ్డ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలోనూ కోర్టులను ఆశ్రయించి సర్కారుకు కళ్లెం వేయగలిగారు. అదే ఊపులో మిగిలిన స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియనూ పూర్తి చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో ఆయనకు ఉన్న ఏకైక అడ్డంకి మార్చితో ముగియబోతున్న పదవీకాలమే.

నిమ్మగడ్డ పదవీకాలం పొడిగింపు
ఈ ఏడాది మార్చితో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం పూర్తి కాబోతోంది. వచ్చేనెల 21వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి.వెంటనే ఈనెల 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఇసి నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి నిఘా వర్గాలు సమాచారాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసే లోపు జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాక మిగిలిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆయనకు దాదాపు నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ లోపు ఈ రెండు ఎన్నికలు పూర్తి చేయడం కష్టమే. అయినా ఓసారి ఎన్నికలు మొదలయ్యాక వాటి కొనసాగింపు కోసం తనకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించేందుకు నిమ్మగడ్డకు వీలుంది. అయినా కేవలం ఎంపీటీసీ, జడ్పీటీసీ లేదా మున్సిపల్ ఎన్నికలు మాత్రమే పూర్తి కావచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం మరో ఎన్నికల కమిషనర్ను నియమిస్తామని కోర్టుకు చెప్పే అవకాశముంది. దీంతో నిమ్మగడ్డ ఇప్పుడు పదవీకాలం పొడిగింపు కోసం కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.

నిమ్మగడ్డకు కలిసొస్తున్న ఆ రెండు నెలలు
గతంలో ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ను వైసీపీ ప్రభుత్వం అర్ధంతరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి సాగనంపింది. దీంతో ఆయన రెండు నెలల పాటు పదవికి దూరమయ్యారు. నిమ్మగడ్డ స్ధానంలో కమిషనర్గా ప్రభుత్వం నియమించిన జస్టిస్ కనగరాజ్ రెండు నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన నిమ్మగడ్డ అనుకున్న ఫలితం సాధించారు. దీంతో ఆయన మరోసారి కమిషనర్ పదవిలో నియమితులయ్యారు. దీంతో తాను కోల్పోయిన ఆ రెండు నెలల పదవీకాలాన్ని తిరిగి ఇప్పించాలని ఆయన కోరబోతున్నారు.

గవర్నర్కు ప్రతిపాదన- కాదంటే హైకోర్టుకు
గతంలో వైసీపీ సర్కారు చర్యల కారణంగా తాను రెండు నెలల పదవీకాలం కోల్పోయానని, దాన్ని తిరిగి ఇప్పిస్తే రెండు నెలల పాటు తనకు పొడిగింపు దక్కుతుందని నిమ్మగడ్డ ఇప్పుడు గవర్నర్ను ఆశ్రయించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్ను పంపనున్నారని సమాచారం. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ గవర్నర్ దీనికి ఒప్పుకోకపోతే.. హైకోర్టుకు వెళ్లి తన పదవీకాలాన్ని తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అదే నిజమైతే నిమ్మగడ్డకు ఎట్టిపరిస్దితుల్లోనూ పొడిగింపు దక్కకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

నిమ్మగడ్డ పొడిగింపుపై సర్కారు వాదన ఇదే
అయితే నిమ్మగడ్డను పదవి నుంచి తీసేసిన ఆ రెండు నెలల కాలానికి కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీతం చెల్లించింది. ఈ కారణంగా ఆయనకు పదవీకాలం పొడగింపు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇలా వరుసగా ఎన్నికలు జరగుతూ ఉన్నందున తనను పదవిని కొనసాగించాలనే వాదనను కూడా ఎస్ఇసి ముందుకు తీసుకురానున్నారు. ఈ వాదనను కూడా వినిపించి కోర్టు నుంచి పదవీకాలం పొడగింపు పొందాలని నిమ్మగడ్డ స్థిరంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్చి 31 తర్వాత ఒక్కరోజు కూడా నిమ్మగడ్డ పదవిలో కొనసాగకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయనుందని సమాచారం.












Click it and Unblock the Notifications