దిశ చట్టం ఓ బోగస్: ఆయేషా తండ్రి సంచలన వ్యాఖ్యలు
తెనాలి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన దిశ చట్టంపై ఆయేషా తండ్రి ఇక్బాల్ బాష సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిశ చట్టం ఓ బోగస్ అని.. ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలి కానీ, రాజకీయ లబ్ధి కోసం కాదని అన్నారు.
కేవలం 21 రోజుల్లో శిక్షలు వేయడం సాధ్యం కాదని ఇక్బాల్ బాష అభిప్రాయపడ్డారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తే నిందితులను పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఆయేషా కేసు విషయంలో సీబీఐ ఎన్ని విచారణలు పూర్తి చేస్తుందో తెలియదన్నారు.

తాము ఆరోపించిన నిందితులను ఇప్పటి వరకు సీబీఐ విచారించిందో లేదో తెలియదని కూడా తెలియదని ఇక్బాల్ అన్నారు. అయినప్పటికీ సీబీఐకి సహకరిస్తామని చెప్పారు. ఆయేషా మీరా కేసులో గతంలో జరిగిన విచారణ అంతా బోగస్ అని ఆయన అన్నారు.
ఈ కేసులో అసలైన నిందితులను పట్టుకోవడం ద్వారా సమాజానికి న్యాయం చేయాలని ఇక్బాల్ బాష కోరారు. మరోవైపు ఆయేషా మీరా తల్లి కూడా ప్రస్తుతం జరుగుతున్న విచారణపై స్పందించారు. ఆయేషా మీరా హత్య కేసులో ఆనాడు తమకు మద్దతుగా నిలిచిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజా.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని షంషాద్ బేగం నిలదీశారు.
నాడు తమ పక్షాన నిలబడి పోరాడిన రోజా.. ఇప్పుడు అసలు స్పందించటం లేదన్నారు. తాము తొలి నుండి ఆరోపిస్తున్నట్లుగా హత్యకు కారకులు ఎవరో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గం వారి పైన దాడులు జరిగితేనే స్పందిస్తారా? అని ప్రశ్నించారు. ఏపీలో ఆయేషా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రీపోస్టుమార్టం తమ మత ఆచారాలకు విరుద్ధమని... అయినప్పటికీ కేసు విచారణ ముందుకు సాగేందుకు రీపోస్టుమార్టంకు ఒప్పుకున్నామన్నారు. తమ కుమార్తె హత్య కేసులో దోషులకు శిక్ష పడాలనే ఇందుకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications