రైతు పోరాటమా ? రాజధాని పోరాటమా ? కేంద్రం వైఖరితో బీజేపీ-జనసేన మల్లగుల్లాలు...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రయత్నాల నేపథ్యంలో బీజేపీ-జనసేన సంకీర్ణం వైఖరి ఎలా ఉండబోతోంది ? అమరావతే రాజధాని అంటూ ఇన్నాళ్లు సమర్ధిస్తూ వచ్చిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాయి ? టీడీపీ తరహాలో అమరావతి రాజధానిగా ఉండాలంటూ భవిష్యత్తులోనూ పోరాడటం చేస్తాయా లేక కేంద్రం వైఖరి నేపథ్యంలో వెనక్కి తగ్గి ఈ పోరును రైతులకు పరిమితం చేస్తాయా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. గతంలో అమరావతి కోసం రాజకీయ తీర్మానం చేశామని చెబుతున్న బీజేపీ ఇప్పుడు కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా ముందుకెళ్తుందా అనేదీ ఆసక్తికరమే..
Recommended Video

అమరావతిపై బీజేపీ-జనసేన..
నిన్న మొన్నటివరకూ అమరావతే రాజధాని కేంద్రం జోక్యం లేకుండా ఎవరూ అంగుళం కదపలేరని బీరాలు పలికిన బీజేపీ-జనసేన నేతలకు తాజాగా మూడు రాజధానుల బిల్లుల ఆమోదంతో కక్కలేని, మింగలేని పరిస్దితి ఏర్పడింది. అన్నింటికీ మించి కేంద్రంతో సంప్రదించకుండా గవర్నర్ మూడు రాజధానుల బిల్లులకు ఆమోదం వేయరని తెలుసుకున్న బీజేపీ-జనసేన నేతలు.. ఇప్పుడు మరోసారి అమరావతి రాజధాని పోరాటం పేరెత్తాలంటేనే భయపడుతున్నాయి. దీంతో రాజధాని పోరాటాన్ని రైతుల పోరాటంగా మారిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయంతో ఇరుపార్టీలు ఉన్నట్లు కనిపిస్తోంది.

రైతుల పోరాటంగా మార్పు..
ఇన్నాళ్లూ రాజధాని అమరావతి కోసం పోరాటం చేసిన బీజేపీ-జనసేన నేతలు.. ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో దీన్ని రైతులకు న్యాయం చేసే పోరాటంగా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాయి. నిన్న జరిగిన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనూ నేతలు అమరావతి తరలిపోకుండా చంద్రబాబు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సేల్స్ మెన్ లా వ్యవహరించారని ఆరోపించారు. ఇక రాజధానిపై చేసేదేమీ లేదనే విధంగా మాట్లాడిన నేతలు.. రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇంతకు మించిన మార్గం లేదనే ఆలోచనకు జనసేన వచ్చినట్లు కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర నేతలు కూడా ఇప్పుడు ఇదే వైఖరి అవలంబించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దింపుడు కళ్లెం ఆశలు..
మూడు రాజధానులపై కేంద్రం సూచనలతోనే గవర్నర్ బిల్లులు ఆమోదించినట్లు తెలియడంతో అటు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టలేక, ఇటు రాజధానిపై ఇంకా పోరాడతామని చెప్పలేక బీజేపీ-జనసేన సతమతం అవుతున్నాయి. దీంతో ఇక చివరి ప్రయత్నంగా హైకోర్టులో ఆగస్టు 6న వెలువడే ఆదేశాల ఆధారంగా ముందుకెళితే బావుంటుందని ఇరు పార్టీలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని రైతులు వేసిన పిటిషన్లు కావడంతో వీటిపై వచ్చే తీర్పును సమర్ధిస్తూ ముందుకెళితే అటు కేంద్రానికీ, ఇటు గవర్నర్ కు ఇబ్బంది లేకుండా ఉంటుందని బీజేపీ-జనసేన వ్యూహరన చేస్తున్నాయి. హైకోర్టు తీర్పు ఆధారంగానే తమ భవిష్యత్ పోరు అజెండా ఖరారు చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications