యువతిని అర్థనగ్నంగా కూర్చోబెట్టి క్షుద్ర పూజలు-వీడియోలు లీక్ చేస్తామని బ్లాక్మెయిల్
కృష్ణా జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఏ సమస్యనైనా క్షుద్ర పూజలతో పరిష్కరిస్తామని చెప్పి ఓ ముఠా అమాయకులను మోసం చేస్తోంది. ఇటీవల అనారోగ్య సమస్యలను నయం చేస్తామని చెప్పి ఓ యువతికి క్షుద్ర పూజలు చేశారు. ఆ సమయంలో ఆమెను అర్థనగ్నంగా కూర్చోబెట్టి వీడియోలు కూడా తీశారు. ఆపై వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బ్లాక్మెయిల్కి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే... గుంటూరులోని శారదానగర్ కాలనీలో వినుకొండ సుబ్బారావు-శివ పార్వతి అనే దంపతులు నివసిస్తున్నారు. ఆరోగ్య,ఆర్థిక,ఇతరత్రా సమస్యలతో బాధపడేవారికి క్షుద్ర పూజలతో అన్నీ నయం చేస్తామని చెప్పి కొంత కాలంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో గూడూరు మండలానికి చెందిన ఓ యువతి ఇటీవల ఆ దంపతులను ఆశ్రయించింది.
తరుచూ అనారోగ్యానికి గురవుతున్నట్లు ఆ యువతి చెప్పడంతో... తాంత్రిక పూజలే కారణమని ఆ దంపతులు నమ్మించారు. దానికి విరుగుడుగా క్షుద్ర పూజలు చేయాలని... అలా చేస్తే ఆరోగ్యం నయం అవుతుందని నమ్మించారు.బాధితురాలి తల్లిదండ్రులు కూడా క్షుద్ర పూజలకు అంగీకరించారు. దీంతో ఓరోజు రాత్రి యువతిని అర్థనగ్నంగా కూర్చోబెట్టి ఇంట్లోనే క్షుద్రపూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఆ తతంగం మొత్తం ఫోటోలు, వీడియోలు తీశారు.
ఆ తర్వాత నుంచి యువతిని,ఆమె తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వని పక్షంలో ఆమె అర్థనగ్న ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తామని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక బాధితురాలు,ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలిసి నిందితులు పరారవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి వారిని పట్టుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో వీరు ఇంకా ఎంతమందిని మోసం చేసి ఉంటారో ఆరా తీస్తున్నారు. ఈ దంపతులకు సహకరిస్తున్న వ్యక్తుల వివరాలు కూడా కూపీ లాగుతున్నారు. క్షుద్ర పూజలతో అన్నీ నయం చేస్తామని ఎవరైనా చెబితే... ఆ మాటలు నమ్మవద్దని పోలీసులు హితవు పలికారు.