జూనియర్ ఎన్టీఆర్ తో కొడాలి నాని మైండ్ గేమ్-ట్రాప్ లో పడబోమన్న బుద్ధా వెంకన్న
వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికీ, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న బంధం అందరికీ తెలిసిందే. అయితే కొడాలికి కొంతకాలంగా దూరంగా ఉంటున్నప్పటికీ జూనియర్ ను టీడీపీ అక్కునచేర్చుకోవడం లేదు. ఇదే అదనుగా చంద్రబాబు తనయుడు లోకేష్ కోసమే జూనియర్ ను దూరం పెడుతున్నారంటూ కొడాలి విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జూనియర్ తో పాటు ఆయన తండ్రి దివంగత హరికృష్ణను సైతం కొడాలి వాడుకున్నారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. దీంతో కొడాలి కూడా ఈ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను అమరావతి రైతులు పాదయాత్రలో టార్గెట్ చేశారని, టీడీపీ పగ్గాలు లోకేష్ కు అప్పగించేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కొడాలి విమర్శలకు దిగారు. దీంతో టీడీపీ కూడా ఆయనకు గట్టిగా కౌంటర్లు ఇస్తోంది. ఇదే క్రమంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ తో మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ కొడాలి నానిపై ఇవాళ విరుచుకుపడ్డారు. అందుకే ఆయన్ను అడ్డుపెట్టి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
కొడాలిగేమ్ మైండ్ గేమ్ లో పడి తాము జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు చేయబోమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలిపారు. కొడాలి ట్రాప్ లో తాము పడబోమన్నారు. జూనియర్ ను తమ రాజకీయాలకు వాడుకుంది కొడాలి నాని మాత్రమేనన్నారు. అలాంటి కొడాలి నాని వల్ల వైసీపీకి కూడా ఎలాంటి ఉపయోగం లేదని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. దీంతో జూనియర్ వ్యవహారంలో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు బుద్ధా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.