చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీ..! మేనకోడలు శిఖా చౌదరిని విచారిస్తున్న పోలీసులు..!!
అమరావతి/హైదరాబాద్ : ఎక్స్ ప్రెస్ టీవి ఛైర్మన్ చిగురుపాటి జయరాం మిస్టీరియస్ డెత్ లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ నగరంలోని కోట్లాది రూపాయల విలువైన భూమి కోసం మృతుడు జయరాం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఒక గెస్టుహౌస్ లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. జయరాం కు బీరులో సెనైడ్ ఇచ్చి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడు జయరాం మేనకోడలు శిఖా చౌదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈమె గతంలో హైదరాబాద్ లో ఉన్న ఎక్స్ ప్రెస్ టీవి కి సీఈవో బాద్యతలను నిర్వహించారు.
ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం పై విష ప్రయోగం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృత దేహం నీలం రంగులోకి మారడంతో పోలీసులు కుట్ర కోణాలపై ఆరా తీస్తున్నారు. రక్తపు నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. దర్యాప్తులో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జయరాం ఇంటికి చేరుకున్న నందిగామ పోలీసులు జయరాం మేనకోడలు శిఖా చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల క్రితం జయరామ్ తల్లి మృతి చెందినప్పటి నుంచి కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయినట్లు సమాచారం. దీంతో పోలీసులు జయరాం కుటుంబసభ్యులు, బంధువులను ప్రశ్నిస్తున్నారు. జయరాం అంతుచిక్కని మరణం వెనక ఎవరు ఉన్నది అనే అంశం శిఖాచౌదరిని విచారిస్తే తేలి పోతుందని పోలీసులు సందేహిస్తున్నట్టు తెలుస్తోంది.