ఇంద్రకీలాద్రీపై సీజేఐ దంపతులు - అమ్మవారి దర్శనం : పూర్ణకుంభంతో స్వాగతం..!!
మూడు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జస్టిస్ వెంకటరమణ దంపతులకు రాష్ట్ర సమాచార పౌరసంబందాల శాఖామాత్యులు పేర్ని నాని స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్ర ధారణతో వచ్చిన జస్టిస్ వెంకటరమణ దంపతులకు ఆలయ మర్యాదలతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆలయ ఈ ఓ భ్రమరాంబ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు .
వెంకటరమణ దంపతులకు అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేదపండితుల చే వెంకటరమణ దంపతులు లకు వేద ఆశీర్వచనం చేశారు అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని , తీర్ధ,ప్రసాదాలను అందజేశారు. దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్లాల్, కలెక్టర్ నివాస్, ఆలయ ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ, ఎంపీ కేశినేని నాని స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
కనకదుర్గమ్మను హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్ర దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం తరువాత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విజయవాడలో బస చేసిన హోటల్ కు వెళ్లారు. అక్కడ పలువురు ప్రముఖులు ఆయన్ను కలవనున్నారు. మధ్నాహ్నం నగరం లోని స్టేడియంలో ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ ఇచ్చే తేనేటి విందుకు సీజేఐ ఎన్వీ రమణతో పాటుగా సుప్రీం - హై కోర్టు న్యాయమూర్తులు హాజరు కానున్నారు.