జగన్ ప్రభుత్వంలో పీకే టీం: కొత్త బాధ్యతలు అప్పగింత: అసలు టార్గెట్ అదే..!
వైసీపీ అధికారంలోకి రావటానికి..జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకారం అందించిన ప్రశాంత్ కిశోర్ టీం సభ్యులు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంలో చేరిపోయారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుండి వైసీపీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలు అందించారు. ప్రచార సమయంలో అనేక కొత్త వ్యూహాలు..కొత్త నినాదాలు తీసుకొచ్చారు. పీకే కు జగన్ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇక, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రశాంత్ కిశోర్ టీం సేవలను కొనసాగించాలని కోరారు. దీంతో..ప్రస్తుతం ఆయన టీంలోని ఒక విభాగంగా ప్రభుత్వ పధకాల అమలు..ఫీడ్ బ్యాక్ కోసం క్షేత్ర స్థాయిలో పని చేస్తోంది. ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పీకే టీంలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తికి ప్రభుత్వం లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసారు.
చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గా నియామకం..
తాజాగా ఏపీ ప్రభుత్వం చీఫ్ డిజిటల్ డైరెక్టర్లుగా ఇద్దరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఒకరు బ్రహ్మనంద పాత్ర. ఆయన పీకే టీం జగన్ కోసం పని చేసిన సమయంలో కీలకంగా వ్యవహరించారు. సోషల్ మీడియా ప్రచారంలో హెడ్ గా వ్యవహరించారు. ప్రత్యర్ధి పార్టీల విమర్శలు..జగన్ పైన చేసిన ఆరోపణలను తిప్పి కొట్టటంలో కీలకంగా పని చేసారు. తెర వెనుక వ్యూహాల అమలులో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం నుండే ఏకంగా ఆయనకు చీఫ్ డిజిటల్ హెడ్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సమయంలో వాటిని సోషల్ మీడియలో తిప్పి కొట్టే బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
టీడీపీకి రాబిన్ శర్మ..జగన్ కోసం ఇక్కడ
ఒకప్పుడు కలిసి పని చేసిన పీకే..రాబిన్ శర్మ ఇప్పుడు ఏపీలో భిన్నండి ఉండే రెండు పార్టీల కోసం పని చేస్తున్నారు. రాబిన్ శర్మతో టీడీపీ ఇంకా అధికారికంగా పని చేయటం ప్రారంభించలేదని సమాచారం. తొలుత పీకే..రాబిన్ శర్మ ఇద్దరూ కలిసే పని చేసే వారు. ఇప్పుడు రెండు సంస్థలను..వేర్వేరుగా ఈ ఇద్దరు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో జగన్ సక్సెస్ వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఉన్నాయనేది అందరూ గుర్తించిన విషయం. ఇదే సమయంలో పార్టీ ప్లీనరీ ద్వారా జగన్ ఓపెన్ గా తన పార్టీకి రాజకీయ వ్యూహాలను ప్రశాంత్ కిశోర్ అందిస్తారంటూ పరిచయం చేసారు. ఇక, ఎన్నికలు ముగియటంతోనే పీకే మరో పార్టీకి సేవలందంచేందుకు మరో రాష్ట్రంలో బిజీ అయిపోయారు.
జగన్ కోసం గ్రౌండ్ లెవల్ లో టీం వర్క్..
ఇప్పటికీ..ప్రశాంత్ కిశోర్ కు చెందిన టీం సభ్యులు గ్రామ సచివాలయాలు..వాలంటీర్ల వ్యవస్థ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంటలిజెన్స్ వర్గాలు చేయాల్సిన పనిని సైతం ఈ టీం సభ్యులే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రజాభిప్రాయాలను సేకరించి ముఖ్యమంత్రికి నివేదిస్తున్నారు. వాలంటీర్లు..గ్రామ సచివాలయ వ్యవస్థ సమర్ధవంతంగా అమలు చేస్తే ఖచ్చితంగా ప్రజలతో నేరుగా ప్రభుత్వం కనెక్ట్ అవుతుందని..దీని ద్వారా పాజిటివ్ ఓటింగ్ పెరుగుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మీడియాలో ఒక వర్గం పూర్తిగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో..డిజిటల్ మీడియా ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకొని ఏకంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం కీలక సభ్యుడికి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.