అలెర్ట్:విజయవాడలో మళ్లీ పూర్తి లాక్ డౌన్.. 26 నుంచి బస్సులు సహా అన్నీ బంద్..
లాక్డౌన్ సడలింపులు తరువాత కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా పెరగడంతో పలు రాష్ట్రాలు మళ్లీ మూసివేతవైపు మొగ్గుచూపాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ కొవిడ్-19 కేసులు భారీగా వెలుగులోకి వస్తుండటంతో మూడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తిరిగి లాక్డౌన్ ప్రకటించారు. ప్రధాన నగరం విజయవాడలోనూ మూడొంతుల డివిజన్లలో లాక్ డౌన్ కొనసాగుతుండగా.. ఇకపై సిటీ మొత్తం పూర్తి లాక్ డౌన్ విధించబోతున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు.

26 నుంచి అన్నీ బంద్..
ఈ నెల 26 నుంచి తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు విజయవాడ సిటీలో పూర్తి స్థాయి లాక్డౌన్ అమలులోకి రానుందని కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. బస్సులు, ఇతర రవాణా సదుపాయాలను కూడా పూర్తిగా నిలిపేస్తామని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కూడా మూసేఉంటాయని, మెడికల్ షాపులు, పాల బూత్ ల వంటి అత్యవసర దుకాణాలు తప్ప మిగతావేవీ తెరుచుకోబోవని స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు కానున్న నేపథ్యంలో ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.

మరింత కఠినంగా..
విజయవాడ నగరంలోని మొత్తం 64 వార్డులకుగానూ, 42 వార్డులను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించామని, అక్కడ లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉంటాయని జూన్ 9నాటి ప్రకటనలో కలెక్టర్ పేర్కొనగా.. ఇప్పుడు కేసుల తీవ్రత ఇంకా పెరగడంతో పూర్తి లాక్ డౌన్ కు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి ప్రభుత్వ యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రజలెవరూ బయట తిరగొద్దని, ప్రజారవాణాను పూర్తిగా నిలిపేస్తామని, పరిస్థితిలో మార్పులను బట్టి ఈ నెల 30న మరోసారి రివ్యూ నిర్వహించిన తర్వాత లాక్ డౌన్ కొనసాగింపు లేదా సడలింపుపై ఆదేశాలిస్తామని కలెక్టర్ వివరించారు.

ఇప్పటికే ఆ మూడు జిల్లాల్లో..
కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు రెండ్రోజుల కిందట అధికారులు ప్రకటించారు. అలాగే, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో లాక్ డౌన్ తో సంబంధం లేకుండా భారీగా కొవిడ్-19 టెస్టులు చేపట్టాలని నిర్ణయించారు. దానికితోడు ఈనెల 26 నుంచి విజయవాడను పూర్తి లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది.

10వేలకు చేరువైన కేసులు..
ఏపీలో గతంలో కంటే వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్నది. మంగళవారం ఉదయం ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కొత్తగా 460 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10వేలకు చేరువైంది. మోస్ట్ ఎఫెక్టెడ్ జాబితాలో కర్నూలు(మొత్తం కేసులు 1407) తర్వాతి స్థానం కృష్ణా జిల్లాదే(1096 కేసులు)కావడం గమనార్హం. కృష్ణాలో మంగళవారం ఒక్కరోజే 33 కొత్త కేసులు వచ్చాయి. అందులో అధికంగా విజయవాడ సిటీకి చెందినవేనని సమాచారం.
Recommended Video

కరోనాపై సీఎం కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో కరోనా టెస్టుల వేగాన్ని పెంచాలని, రోజుకు కనీసం 30 వేల శాంపిల్స్ ను టెస్టు చేసేలా యంత్రాంగం పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రాబోయే 90 రోజుల్లో వైద్య బృందాలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలందరికీ టెస్టులు నిర్వహించాలన్నారు. సోమవారం ఆరోగ్య శాఖపై రివ్యూలో ఆయనీ కామెంట్లు చేశారు.












Click it and Unblock the Notifications