నవరత్నాల్లో రాజధాని మార్పు లేదు..? సొంత ప్రయోజనాలే ముఖ్యం, సీఎం జగన్పై దేవినేని ఉమ ఫైర్
ఏపీలో రాజధాని మార్పు అంశం కాకరేపుతోంది. అమరావతితోపాటు విశాఖపట్టణం, కర్నూలు రాజధానిగా మార్చే అవకాశం ఉందని అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన సెగలు రేపుతోంది. జగన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. రాజధాని మార్పు వెనక సొంత లాభం ఉందని మాజీ మంత్రి దేవినేనిఉమహేశ్వరరావు ఆరోపించారు.

నవరత్నాల్లో లేదే..
జగన్ ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించిన నవరత్నాల్లో రాజధాని మార్పు లేదు కదా అని దేవినేని ఉమా గుర్తుచేశారు. రాజధాని మార్చడం వెనక సొంత ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. రాజధాని కోసం రైతులు తమ భూములని ఇస్తే.. జగన్ వారిపై గుదిబండ వేశారని విమర్శించారు. జగన్ ప్రకటనతో రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు.

6 వేల ఎకరాల భూమి
భోగాపురం ఎయిర్ పోర్టు వద్ద విజయసాయిరెడ్డి 6 వేల ఎకరాలు కొనుగోలు చేశారని దేవినేని ఉమ ఆరోపించారు. అందుకోసమే రాజధాని మార్పు అంటున్నారని చెప్పారు. రాజధాని మార్పుపై ఎమ్మెల్యే వసంత నోరు విప్పాలని కోరారు. ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. రాజధాని మార్పుపై మైలవరం ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఇప్పటికే రాజధాని మార్పు ప్రచారంతో భూముల ధరలు తగ్గి భూములున్న వారు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.

మంత్రుల కౌంటర్
టీడీపీ నేతల కామెంట్లపై మంత్రులు కూడా ఖండిస్తున్నారు. టీడీపీ చేసిన తప్పులను సీఎం జగన్ సరిదిద్దుతున్నారని మంత్రులు కన్నబాబు, పేర్ని నాని తెలిపారు.
రాజధానిపై కమిటీ నివేదిక ఇలా ఉండొచ్చని సీఎం జగన్ చెప్పారే తప్పా, ఇదే ఫైనల్ అని చెప్పలేదని పేర్కొన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందుతుదని మంత్రి కన్నబాబు చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ ఎందుకు ఆందోళనకు గురవుతుందో అర్థం కావడం లేదన్నారు. రాజధాని మార్పు గురించి జయప్రకాశ్ నారాయణ మద్దతివ్వడం విశేషం.












Click it and Unblock the Notifications