బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు-రోజుకు 10 వేల మందికే దర్శనం-ఆన్ లైన్ టికెట్లతో
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే దీనిపై సమీక్ష నిర్వహించిన దేవాదాయశాఖ, పురపాలకశాఖ తగిన ఏర్పాట్లు చేసేలా నిర్ణయాలు తీసుకున్నాయి. కరోనా నేపథ్యంలో శరన్నవరాత్రులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఆంక్షలు కూడా విధిస్తున్నారు.
ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ విజయవాడ ఇంద్రకీలాద్రీపై కొలువైున కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు జరగబోతున్నాయి. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా భారీగా భక్తులు దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే భవానీ మాల ధారులు కూడా భారీ సంఖ్యలో రానున్నారు. అసలే కరోనా సమయం కావడంతో వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనాలు పూర్తి చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం కొన్ని ఆంక్షలు కూడా విధిస్తున్నారు.

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతీ రోజూ 30 వేల మందిని మాత్రమే అనుమతించాలని ముందుగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ సంఖ్యను తిరిగి 10 వేలకు తగ్గించారు. దీంతో భక్తులు నిరాశకు గురవుతున్నారు. అయితే కోవిడ్ వ్యాప్తి భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని చెప్తున్నారు. దీనిపైనా భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆఫ్ లైన్ లోనూ టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈసారి భవానీ మాలధారులు ఇరుముడుల సమర్పణకు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని అధికారులు ప్రకటించారు.
వాస్తవానికి ప్రతీ ఏటా ఇంద్రకీలాద్రిపై జరిగే శరన్నవరాత్రుల సందర్భంగా భారీ ఎత్తున భక్తులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలి వస్తుంటారు. మూలా నక్షత్రం రోజుతో పాటు భవానీ మాలలు విరమించేందుకు కూడా భారీగా భక్తులు వస్తారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి వస్త్రాల సమర్ఫణ కూడా ఉంటుంది. దీంతో భద్రత ఏర్పాట్లు కూడా కీలకంగా మారుతుంటాయి. ఈసారి కోవిడ్ నేపథ్యంలో వీటిలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications