పండగపూట పెను విషాదం: ఆడుకుంటూ చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి
కృష్ణా: జిల్లాలోని కైకలూరు మండలం వరాహపట్నంలో పండగపూట పెను విషాద ఘటన చోటు చేసుకుంది. వరాహపట్నం గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. ఈతరాకపోవడంతో నలుగురు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు బాలికలు ఉండగా, ఒక బాలుడు ఉన్నాడు.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దసరా పండగకు ముందు రోజే నలుగురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బాలుడి దారుణ హత్య
చిత్తూరు జిల్లా పీలేరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఓ బాలుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పీలేరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన నాగిరెడ్డి, జ్యోతి దంపతులు. వీరికి ఎనిమిదేళ్ల తేజేష్ అనే కుమారుడు ఉన్నాడు. తేజేష్ తల్లిదండ్రులు కుటుంబ పోషణకై కువైట్ వెళ్లి సంపాదించాలనుకున్నారు. ఇందుకు తమ దగ్గర డబ్బు లేక పోవడంతో.. వడ్డీ వ్యాపారులైన రవీంద్రరెడ్డి, భూదేవిరెడ్డి దగ్గర ఐదేళ్ల క్రితం అప్పు చేశారు.
ఆ డబ్బుతో కువైట్ వెళ్లారు. అక్కడ సంపాదించిన డబ్బులతో ఇక్కడ అప్పిచ్చిన వాళ్లకు వడ్డీ కడుతూ వచ్చారు. కాగా, ఈ క్రమంలో నాగిరెడ్డి దంపతుల కుమారుడు తేజేష్ దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, ఇప్పటి వరకూ తాము రెండు లక్షల రూపాయల వరకూ కట్టామనీ.. వడ్డీ కూడా సెటిల్ చేస్తామని చెప్పామనీ.. అయినా సరే వాళ్లు తమపై కక్ష కట్టారనీ.. తమ పిల్లాడ్ని కడతేర్చేశారనీ వాపోయింది తేజేష్ తల్లి. ఇలాంటోళ్లను ఉరి తీయాలని డిమాండ్ చేస్తోంది.
కాగా అప్పిచ్చినవారు, బాధిత కుటుంబానికి బంధువులు కూడా కావడం గమనార్హం. తల్లి ఆరోపిస్తున్నట్టు ఇందులో వడ్డీ ఇచ్చినోళ్ల తప్పే ఉందా? లేక ఈ కడుపుకోత వెనక మరేదైనా దాగి ఉందా? అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా.. ఒక అమాయక బాలుడైతే అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు ఆర్ధిక లావాదేవీలే కారణమా? లేక కుటుంబ కక్షలేనా? ఏం జరిగింది? పోలీసుల విచారణలో తేలనుంది.
Recommended Video
కొడుకు మరణ వార్త విన్నవెంటనే తల్లిదండ్రులు కువైట్ నుంచి హుటాహుటిన పీలేరు చేరుకున్నారు. కన్నపేగు బంధం తెగడంతో.. గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ తల్లిని చూసి.. అక్కడున్నవారంతా చలించిపోయారు. స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కాళ్ళపైపడి తల్లి జ్యోతి వేడుకున్న విధానం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. ఎన్నో పూజల చేస్తే పుట్టిన ఒకానొక కొడుకును దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. బాలుడి హత్యపై కేసు నమోదు చేసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడి హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులతోపాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.