YS Jagan: దిశ చట్టం ఆమోదంపై విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు: కొండంత అండగా..!
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ దిశ చట్టాన్ని శాసనసభ ఆమోదించడం పట్ల విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ చట్టం ఆమోదం పొందిన వెంటనే- రాష్ట్రంలోని పలు కళాశాలలు, విద్యాసంస్థల్లో సందడి నెలకొంది. ఆయా కళాశాలల విద్యార్థినులు ప్రధాన గేట్ల వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. థ్యాంక్యూ సీఎం సర్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్లకార్డులను ప్రదర్శించారు.

దిశ చట్టానికి అసెంబ్లీ ఆమోదం..
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరి శిక్ష విధించేలా రూపొందించిన ఏపీ దిశ చట్టానికి శాసనసభ శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ ఉదయం శాసనసభలో ఈ బిల్లను ప్రవేశ పెట్టగా.. ఏకగ్రీవంగా ఆమోదించారు సభ్యులు. దీనితో ఇది చట్టంగా రూపాంతరం చెందింది. బిల్లుపై శాసనసభ ఆమోదించిన వెంటనే- మహిళలు, విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కళాశాలల్లో సందడి..
ఏపీ దిశ చట్టానికి సభ ఆమోదించిన వెంటనే వైఎస్ జగన్ సొంత జిల్లా కడప, అనంతపురం, కృష్ణా, విజయనగరం వంటి జిల్లాల్లో విద్యార్థినులు సంబరాలు జరుపుకొన్నారు. చాలాచోట్ల బ్యానర్లను ప్రదర్శించారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. కళాశాల ప్రధాన గేటు వద్ద కేక్ ను కట్ చేశారు. పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఆయా కళాశాలలు, విద్యాసంస్థల బోధన, బోధనేతర మహిళా సిబ్బంది సైతం ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

నాడు చెప్పారు.. నేడు చేశారంటూ..
మహిళలు, అమ్మాయిలపై కన్నేసిన వారెవరైనా సరే.. వారిని శిక్షించడానికి అత్యంత కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆడవారిపై కన్నేసిన వారి కనుగుడ్లను పీకేసేంతటి భయంకరమైన చట్టాలను తీసుకుని వస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా- మహిళలు, యువతులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను 21 రోజుల్లోనే ఉరి శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకుని రావడం పట్ల తమకు కొండంత ధైర్యాన్ని ఇస్తోందని విద్యార్థినులు వ్యాఖ్యానిస్తున్నారు.

అత్యాచారానికి పాల్పడితే..
అత్యాచారానికి పాల్పడిన తొలి ఏడు రోజుల్లోనే నిందితుల నేరాన్ని నిరూపించడానికి అవసరమైన ప్రాధమిక ఆధారాలను పోలీసు యంత్రాంగం సేకరించాల్సి ఉంటుంది. 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. దీనికి అవసరమైన సహాయ, సహకారాలను హోం మంత్రిత్వ శాఖ యుద్ధ ప్రాతిపదికన అందిస్తుంది. రాష్ట్రంలోని అన్ని పాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఈ చట్టం కింద 21 రోజుల్లోనే విచారణ ముగించి, ఉరిశిక్షను అమలు చేస్తారు.












Click it and Unblock the Notifications