ఏబీ కేసులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ: సస్పెన్షన్ ఎత్తివేసిన హైకోర్టు: సీఎం కిం కర్తవ్యం..!
విజయవాడ: జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఊహించని షాక్ ఎదురైంది. చంద్రబాబు హయాం నుంచి వైసీపీ టార్గెట్ చేసిన నాటి నిఘా చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు ఊరటనిచ్చింది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ ఫిర్యాదుతో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం తప్పించింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం పక్కనబెట్టింది. అయితే ఏబీ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా..
చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పై నంద్యాల ఉప ఎన్నికల సమయంనుంచి వైసీపీ గుర్రుగా ఉంది. ఆయన పోలీసు అధికారిలా కాకుండా టీడీపీ నేతగా వ్యవహరించారంటూ ఆరోపించింది. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవని ఒక వర్గానికి చెందిన అధికారులనే నిఘా విభాగంలో కీలక స్థానంలో నియమించారనేది వైసీపీ నాటి ఆరోపణ. అదే విషయాన్ని ఎన్నికల సంఘానికి వైసీపీ నాడు ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల విధులనుంచి తప్పిస్తూ నాడు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దాంతో నాటి సీఎం చంద్రబాబు విబేధించినా నిర్ణయం అమలు చేయక తప్పలేదు.

జగన్ ప్రభుత్వంలో సస్పెన్షన్కు గురైన ఏబీ
ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన నాటినుంచి సంవత్సరకాలంగా ఏబీ వెంకటేశ్వరరావుకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కొద్దినెలల క్రితం ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాలను దుర్వినియోగం చేయడంతో పాటుగా గోల్మాల జరిగిందంటూ పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీనిపైన విచారణకు ఆదేశించింది. కేంద్ర హోంశాఖ సైతం ఈ ఫిర్యాదుపైన పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. తనను సస్పెండ్ చేయడం పై ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ను ఆశ్రయించారు. క్యాట్ సైతం ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్థించింది. దీంతో తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
Recommended Video

హైకోర్టు ఏమి చెప్పింది..?
రిట్ పిటిషన్ను విచారణ చేసిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీ సస్పెన్షన్ను ఎత్తివేసింది. క్యాట్ ఆదేశాలను పక్కన బెట్టింది. సస్పెండ్ చేసిన కాలంనుంచి జీతభత్యాలను చెల్లించాలని వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వానికి ఇది ఊహించని పరిణామంగా మారింది. ఏబీని సస్పెండ్ చేసిన సమయంలో కేశినేని నాని లాంటి ఎంపీలు సైతం ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు హైకోర్టు తాజా ఆదేశాలపై ప్రభుత్వం ఏరకంగా ముందుకెళుతుందనేది అటు రాజకీయంగానే కాకుండా అధికార వర్గాల్లోను ఆసక్తికరంగా మారింది. హైకోర్టులో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు వ్యతిరేక తీర్పులపైన ముఖ్యమంత్రి జగన్ ఏవిధంగా ముందుకెళతారనే చర్చ సాగుతోంది. ఇక ప్రత్యేకించి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది.












Click it and Unblock the Notifications