కోర్టుల ద్వారా టీడీపీ అడ్డుకుంటోంది - జగన్ సంచలన కామెంట్స్- గవర్నర్ ఆదేశాల వేళ ప్రాధాన్యం...
ఏపీలో ఏ కార్యక్రమం చేపట్టినా విపక్ష టీడీపీ అడ్డుకుంటోందని సీఎం జగన్ పలుమార్లు ఆరోపించారు. తాజాగా ఇవాళ విజయవాడలో నిర్వహించిన వన మహోత్సవం సందర్భంగా మరోసారి జగన్ ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాస్తవానికి జగన్ మరో అంశంలో ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటించినా ప్రస్తుత పరిస్ధితులకు తగ్గట్టుగానే ఆయన ఈ విమర్శలు చేశారా అన్న చర్చ సాగుతోంది.
జగన్ సర్కారుకు భారీ షాక్- మరోసారి ఎస్ఈసీగా నిమ్మగడ్డ - గవర్నర్ ఆదేశం...
కోర్టుల ద్వారా టీడీపీ ఆటంకాలు...
ఏపీలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలపై విపక్ష టీడీపీ గత ఏడాది కాలంలో పలుమార్లు కోర్టులను ఆశ్రయించింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పలు పిటిషన్లను దాఖలు చేసింది. వీటిలో కొంత వరకూ ఫలితాలను కూడా సాధించింది. మరికొన్నింటిలో ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోగలిగింది. వీటిపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నారని అందరికీ అర్ధమవుతూనే ఉన్నా.. తాజాగా జగన్ తన మనసులో మాటను బహిరంగంగా వెల్లడించడంతో దీనిపై సర్వత్రా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో దౌర్భాగ్య రాజకీయాలు నడుస్తున్నాయని, కోర్టుల ద్వారా ప్రతీ కార్యక్రమాన్ని టీడీపీ అడ్డుకుంటోందని జగన్ తాజాగా విజయవాడలో నిర్వహించిన వన మహోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇళ్ల స్ధలాలను అడ్డుకున్న టీడీపీ..
రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ప్రతీ కార్యక్రమాన్ని టీడీపీ అడ్డుకుంటోందని, చివరకు కోర్టుల్లో పోరాటం చేసి ప్రభుత్వం పథకాలను అమలు చేయాల్సి వస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్లస్ధలాల విషయంలోనూ టీడీపీ కోర్టుల్లో కేసులు వేసిందని, చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ఆగస్టు 15న ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నామని, ఆ లోపు సానుకూల నిర్ణయం రావొచ్చన్నారు. వనమహోత్సవ వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన జగన్.. టీడీపీ వాళ్లు ఏ రకంగా కేసులు వేస్తున్నారో మీ అందరికీ తెలుసు, చివరకు పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడాన్ని కూడా అడ్డుకుంటున్నారు దీన్ని నివారించడం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందన్నారు.
Recommended Video
గవర్నర్ ఆదేశాల వేళ జగన్ వ్యాఖ్యలు...
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తొలగించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి అదే పదవిలో నియమించాలని హైకోర్టు, సుప్రీంకోర్టులో టీడీపీ నేతలు పిటిషన్లు వేశారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ ఇవాళ నిమ్మగడ్డను తిరిగి నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. దీంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అదే సమయంలో తమకు ఇష్టంలేని నిమ్మగడ్డ నియామకం జరుగుతుండటంతో సీఎం జగన్ తన అసంతృప్తిని టీడీపీ నేతలపై విమర్శల రూపంలో బయటపెట్టారా అన్న చర్చ జరుగుతోంది. అయితే జగన్ ఎక్కడా ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడకపోయినా టీడీపీ కోర్టుల ద్వారా ప్రభుత్వ ఆదేశాలను అడ్డుకుంటున్న విషయాన్ని జగన్ పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.