పొత్తులుండవు..! అందుకోసమేనా జగన్, కేటీఆర్ భేటీ..!
విజయవాడ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ చర్చానీయాంశంగా మారింది. అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం.. ఇటు లోక్ సభ ఎలక్షన్ల పర్వం వెరసి వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ జతకట్టడం టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. ఆ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. తాజాగా ఈ ఇద్దరు యువనేతల భేటీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పేందుకేనా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఫెడరల్ ఫ్రంట్ కోసం మాత్రమే వీరిద్దరి భేటీ జరిగిందంటున్నారు వైసీపీ నేతలు.
మేము మీలాగా కాదు..! అందుకే ఆ భేటీ
ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ భేటీ అయినట్లు స్పష్టం చేశారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. అయితే వీరిద్దరి భేటీపై టీడీపీ నేతలు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడిది నీచమైన మనస్తత్వమని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దేశవ్యాప్తంగా ఆయా పార్టీల నేతలతో జరుగుతున్న చర్చల్లో భాగంగా మాత్రమే జగన్ ను కేటీఆర్ కలిశారని తెలిపారు. అంతేగానీ వీరిద్దరి మధ్య పొత్తుల ప్రస్తావన రాలేదని చెప్పుకొచ్చారు.
చంద్రబాబులాగా తాము సీట్ల కోసం పాకులాడే రకం కాదన్నారు అంబటి రాంబాబు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. ఎవరితో లాలూచీ పడబోమని.. ఏ పార్టీతోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు. జగన్, కేటీఆర్ మధ్య ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చ జరిగితే.. ఏదేదో ఊహించుకుని టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లుగా అరుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఛీ కొట్టాక.. చివరకు కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
పొత్తుల కోసం కాదు.. హక్కుల పోరాటానికి..!
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా జగన్, కేటీఆర్ భేటీ జరిగిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఇది ప్రారంభం మాత్రమేనని.. త్వరలో స్వయంగా కేసీఆర్ జగన్ తో చర్చలు జరుపుతారని చెప్పారు. రాష్ట్రాల హక్కులపై పోరాడటానికి ఫెడరల్ ఫ్రంట్ ఒక వేదికగా మారుతుందని తెలిపారు. ఇది వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించింది కాదని.. ఆయా రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు కలిసి నడుస్తాయని చెప్పుకొచ్చారు. ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీలకే వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. భాగస్వామ్య ప్రాంతీయ పార్టీలకు మద్దతుగా ఫెడరల్ ఫ్రంట్ ప్రచారం నిర్వహిస్తుందని తెలిపారు. అంతేగానీ పొత్తులంటూ ఏవీ ఉండబోవని తెలిపారు.
జగన్ రిమోట్ కంట్రోల్.. కేసీఆర్ పెత్తనం
జగన్, కేటీఆర్ భేటీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అటు టీడీపీ నేతలు వీరిద్దరి భేటీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఈ సమావేశం జరిగిందని వైసీపీ నేతలు చెబుతుంటే.. ఏపీపై పెత్తనం చెలాయించడానికి కేసీఆర్ పన్నుతున్న కుట్ర అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ తో జతకట్టి ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా జగన్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. జగన్ ను రిమోట్ కంట్రోల్ గా వాడుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.