నా తమ్ముడు వంగవీటి రాధాబాబు అడిగితే..ఏదైనా: ఒకే వేదికపై కొడాలి నాని-రాధా-వల్లభనేని వంశీ..!!
విజయవాడ: సోమవారం.. ప్రముఖ కాపు నేత, దివంగత వంగవీటి మోహన రంగా వర్ధంతి. 1988 డిసెంబర్ 26వ తేదీన రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. నిరాహార దీక్ష శిబిరంలోనే ఆయనను మట్టుబెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వంగవీటి రంగా హత్యకు గురి కావడం పెను సంచలనానికి దారి తీసింది. అప్పటి తీవ్రత ఇప్పటికీ కొనసాగుతోంది. వంగవీటి రంగాది రాజకీయ హత్యగా దీన్ని అభివర్ణిస్తుంటారు కాపు నాయకులు.
నున్నలో
వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడ సమీపంలోని నున్నలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడివాడ శాసన సభ్యుడు, మాజీమంత్రి కొడాలి నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వంగవీటి రాధాకృష్ణ, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇందులో పాల్గొన్నారు. ఈ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించడం వల్ల రాజకీయంగా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎదుగుదలను అడ్డుకోవడానికి..
విగ్రహావిష్కరణ అనంతరం కొడాలి నాని మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా ఓ వ్యక్తి కాదని, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓ తిరుగులేని శక్తిగా పేర్కొన్నారు. ఆయనను ఎదుగుదలను అడ్డుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులు ఎంతో ప్రయత్నించారని, అది సాధ్యం కాకపోవడంతో ఆ వ్యక్తిని ఈ భూమ్మీదే లేకుండా చేయడానికి కుట్ర పన్నారని, దారుణంగా హత్య చేశారని అన్నారు.
కనుసన్నల్లో..
విజయవాడ రాజకీయాలను కనుసన్నల్లో వంగవీటి రంగా శాసించారని, ప్రభుత్వాన్ని ఎదిరించి నిలిచారని కొడాలి నాని చెప్పారు. తనను చంపడానికి ప్రయత్నిస్తోన్నారని, రక్షణ కల్పించాలంటూ నిరాహార దీక్ష చేస్తోన్న వ్యక్తిని అదే శిబిరంలో అత్యంత పాశవికంగా హత్య చేయించారని ధ్వజమెత్తారు. భౌతికంగా రంగాను దూరం చేసినప్పటికీ- ఆయన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొడాలి నాని చెప్పారు.
ప్రజల కోసమే..
ప్రజల కోసమే వంగవీటి రంగా జీవించారని, తన కుటుంబాన్ని పట్టించుకోకుండా ఓ సామాన్యుడి కోసం పని చేశారని కొడాలి నాని అన్నారు. ప్రజల కోసం వ్యవస్థలను ఎదిరించారని చెప్పారు. వంగవీటి రాధాను కొడాలి నాని ఈ సందర్భంగా తన తమ్ముడిగా అభివర్ణించారు. తన తమ్ముడు రాధా బాబు అడిగితే- ఆయన అభిమానులు వెయ్యి ఇళ్లను ఖాళీ చేసి ఆయనకు ఇస్తారని ప్రశంసించారు. తండ్రి ఆశయాలను సాధించడానికి రాధా నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు.
దేనికీ లొంగడు..
వంగవీటి రాధా ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదని కొడాలి నాని అన్నారు. డబ్బులిస్తామన్నా గానీ, రాజ్యసభకు పంపిస్తామన్నా గానీ.. ఏది కోరితే అది చేస్తామని హామీ ఇచ్చినా గానీ లొంగే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. తన తండ్రి తనకు ఇచ్చి వెళ్లిన ప్రజలే తనకు అతిపెద్ద ఆస్తిగా రాధా భావిస్తారని చెప్పారు. రంగా ఆశీస్సులు ఆయన మీద ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.