వైసీపీ రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదన్న ఎమ్మెల్యే..అలా అయితే ఈ రగడ దేనికి అంటున్న తెలుగు తమ్ముళ్ళు
ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా చేసిన ప్రకటనతో ఏపీలో రాజకీయ దుమారం నెలకొంది. ఆ తర్వాత జీఎన్ రావు కమిటీ నివేదిక సైతం జగన్ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నట్టు తెలియటంతో రాజధాని ప్రాంత రైతులు ఆందోళనల బాట పట్టారు. అమరావతి పరిరక్షణా సమితి పేరుతో రాజధాని గ్రామాల రైతులు రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తూ ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక రాజధాని ప్రాంత ప్రజాప్రతినిధులు కనిపించకుండా దూరంగా ఉంటుంటే, జేఏసీ నేతలకు కలిసిన ఎమ్మెల్యేలు రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని సమాధానం ఇస్తున్నారు. అయితే రెండు నాల్కల ధోరణిలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తహం చేస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కలిసి వినతిపత్రం ఇచ్చిన నేతలు
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న అమరావతి పరిరక్షణ సమితి ఈ మేరకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాదివిష్ణును కలిసింది. జేఏసీ నేతలు సింగినగర్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కలసి వినతిపత్రం అందించారు. రాజధాని అమరావతిని తరలించవద్దని కోరారు. ఎమ్మెల్యేగా రాజధాని రైతుల పక్షాన మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఇక జేఏసీ నేతలతో మాట్లాడిన విష్ణు సానుకూలంగా స్పందించారు.

రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు
రాజధానిని ఈ ప్రాంతం నుంచి తరలించవద్దని జేఏసీ ప్రతినిధులు తనను కోరారని చెప్పిన మల్లాది విష్ణు ప్రస్తుతం రాష్ట్రం 2లక్షల 60వేల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. అమరావతి రాజధాని ఏర్పాటును వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని పేర్కొన్నారు . టీడీపీ హయాంలో గత ఐదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని విష్ణు విమర్శించారు.రాజధానిలో రైతులకు ప్లాట్లు ఇస్తామంటే తాము ఎక్కడా అడ్డుపడలేదన్నారు. ఎప్పుడూ రాజధాని అమరావతి విషయంలో తాము వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు.

టీడీపీ నేతలదే ద్వంద్వ వైఖరి అని విమర్శలు చేసిన ఎమ్మెల్యే
ఈ నెల 27న కేబినెట్లో చర్చించి రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారన్నారు.రాజధానుల ఏర్పాటుపై మంత్రివర్గంలో అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందన్నారు. రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదన్న వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలుగుదేశం ద్వంద వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. విశాఖపట్నానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు రాజధాని అక్కడే ఉండాలని కోరుతుంటే ఇక్కడ నేతలు రాజధాని అమరావతే అని మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.

రాజధానిపై వ్యతిరేకత లేకుండానే ఇదంతా చేస్తున్నారా ? టీడీపీ ప్రశ్న
ఇక మల్లాది విష్ణు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బొండా ఉమా మల్లాది వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒక పక్క రాజధానిగా ఉన్న అమరావతిని వైజాగ్ కు తరలించే కుట్ర చేస్తూనే మరో పక్క రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని వైసీపీ నేతలు చెప్తున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయని వారు మండిపడుతున్నారు. ద్వంద్వ వైఖరి, రెండు నాల్కల ధోరణి వైసీపీ నేతలదే అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా రాజధానిగా వైజాగ్ అని సీఎంప్రకటన చేసినా వైసీపీ నేతలు ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications