గ్రామ సచివాలయ వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించిన నాదెండ్ల భాస్కర్ రావు .. జగన్ పై ఫైర్
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అని భావించి గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన వ్యవస్థ గ్రామ సచివాలయాలు అని ఎంతో గొప్పగా చెప్తుంది . ఇక ఈ నేపధ్యంలో నేడు గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామాల సమగ్రాభివృద్ధికి కంకణం కట్టుకున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.
అయితే గ్రామ పంచాయతీలు ఉండగా గ్రామ సచివాలయం వ్యవస్థ అవసరమని జగన్ తీసుకున్న నిర్ణయం పై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలలో ఉన్న గ్రామ పంచాయతీలను పటిష్టం చేసి, గ్రామాభివృద్ధికి పనిచేసే విధంగా వారికి దిశానిర్ధేశం చేయాల్సిన చోట కొత్తగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడంపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు నేడు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సచివాలయ వ్యవస్థ అవసరమా? అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.
అనుభవ రాహిత్యంతో జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు . ప్రతి 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు అవసరం లేదన్నారు. ఇక ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడానికి ఇప్పటికే దివాలా తీసిన ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు, వైసిపి ప్రభుత్వ విధానం ప్రజలు చేయించుకునేలా ఉండకూడదని నాదెండ్ల భాస్కరరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించడానికి ఏవిధంగానూ చొరవ చూపని జగన్ ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేసి, కొత్త వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం లేదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications