ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీ .. పరిశ్రమలపై టీడీపీది దుష్ప్రచారం : మంత్రి గౌతమ్ రెడ్డి
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తీసుకున్న నిర్ణయాలతో ఏపీలో పరిశ్రమలు వెనక్కు పోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ఇదంతా టీడీపీ చేస్తున్న దుష్ప్రచారమే అని చెప్తున్నారు వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి .
త్వరలో ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీ
జగన్ మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీలో అనిశ్చితి నెలకొందని , ఏ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టటానికి ఎపీకి రావటం లేదని, ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోతున్నాయన్నది టీడీపీ వాదన . అయితే ఈ వాదన తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలను ఆహ్వానించి, పెట్టుబడి పెట్టించి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వైసీపీ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పిన పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకురానున్నట్టు చెప్పారు.
టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకునేది లేదన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని టీడీపీ నేతలు పనిగట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చిలో కొత్త పాలసీని ప్రకటిస్తామని పేర్కొన్నారు మంత్రి మేకపాటి . నాడు చంద్రబాబు హయాంలో వదిలేసిన పరిశ్రమలను కూడా ఏపీకి తీసుకొస్తామని చెప్పారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకునేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.
పరిశ్రమల కోసం అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు
ఇక ఏపీలో ఉన్న కియా మోటార్స్ విషయంలో కూడా టీడీపీ దుష్ప్రచారం చేసిందని కానీ ప్రభుత్వం తమకు సహకరిస్తుందని సాక్షాత్తు కియా మోటార్స్ యాజమాన్యం చాలా స్పష్టంగా చెప్పిందని ఆయన వివరించారు .పరిశ్రమల కోసం అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి . ఈ ఏడాది ఒక్క విశాఖలోనే 50 వేల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని, ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.
సులభంగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్కరణలు
పరిశ్రమలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 75 శాతం స్కిల్ ఉన్న మానవ వనరులను ఇస్తున్నామని తెలిపారు. ఇక ఏపీలో మూడు పోర్టులను ఏర్పాటు చేయాలని కూడా సీఎం నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడిదారులు సులభంగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నామని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్ లో ఏపీలో పారిశ్రామిక ప్రగతి చూస్తారని ఆయన పేర్కొన్నారు.