మైలవరం కోర్టులో దేవినేని ఉమను హాజరుపర్చిన పోలీసులు-భారీ భద్రత మధ్య
కృష్ణాజిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రానైట్ మైనింగ్ ను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు ఎట్టకేలకు మైలవరం కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. ఉమపై పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం, అట్రాసిటీ కేసులపై దర్యాప్తు జరుగుతోంది.
నిన్న సాయంత్రం కొండపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లిన దేవినేని ఉమ వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆయనపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి ఉమపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఇందులో హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. నిన్న రాత్రే పెదపారుపూడి పోలీసు స్టేషన్ కు, ఆ తర్వాత నందివాడ పీఎస్ కు ఉమను తరలించిన పోలీసులు ఇవాళ భారీ భద్రత మధ్య మైలవరం కోర్టులో హాజరుపరిచారు.
దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేశారన్న వార్తతో కృష్ణాజిల్లాలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఉమను నిర్బంధించిన నందివాడ పీస్ ముందు ఆందోళన చేపట్టిన కార్యకర్తలు.. ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ పోలీసుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా భారీ భద్రత మధ్య పోలీసులు ఆయన్ను మైలవరం కోర్టుకు తరలించారు. ఉమను తీసుకెళ్తున్న దారి పొడవునా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
మైలవరం కోర్టులో దేవినేని ఉమను హాజరుపర్చిన పోలీసులు-భారీ భద్రత మధ్య #andhrapradesh, #vijayawada #devineniuma pic.twitter.com/74DooOijUS
— oneindiatelugu (@oneindiatelugu) July 28, 2021