ఎవరితో పొత్తు ఉండదు: ప్రధాని మోదీ వద్దకు రాజధాని రైతులు: బీజేపీ నేత రాంమాధవ్..!
ఏపీలో ఎవరితోనూ తమకు పొత్తు ఉండదని బీజేపీ కీలక నేత రాం మాధవ్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో సొంత శక్తితోనే ఎదిగే విధగా వ్యూహాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన విధంగానే రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు... అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని ఆరోపించారు. పార్టీ బలోపేతం దిశగా చర్యలు ప్రారంభించామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని రాం మాధవ్ ప్రారంభించారు. రాజధాని రైతులకు రాం మాధవ్ భరోసా ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని..రాజధాని తరలింపు విషయంలో కేంద్రం రైతులకు మద్దతుగా నిలవాలని తుళ్లూరు ప్రాంత రైతులు అభ్యర్దించారు. త్వరలోనే ప్రధాని మోదీతో సహా..అమిత్ షాతో కలిసే విధంగా చూస్తానని రాం మాధవ్ రాజధాని ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు.
టీడీపీ మునిగిపోయే నావ..
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినా..పాత ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తోందని బీజేపీ కీలక నేత రాం మాధవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పధకాలు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నట్లుగా తమకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ..ఇప్పుడు వైసీపీ సైతం కేంద్ర పధకాలను తమ పధకాలుగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు.లబ్దిదారుల ఎంపిక వైసీపీ కార్యకర్తలకు కమిటీల ద్వారా చేయటం సరికాదన్నారు. టీడీపీ మునిగిపోతున్న నావ అని... అందరూ పార్టీని వీడుతున్నారని రాం మాధవ్ పేర్కొన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చంద్రబాబు తీరుందని విమర్శించారు. ఏపీలో నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. పోషిస్తామన్నారు. అన్ని ఎన్నికలలో సొంతంగా పోటీ చేస్తామని రాం మాధవ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ముందుకు వెళ్లాలని.. ఆ దిశగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

రాజధాని ప్రాంత రైతులకు అండగా..
రాజధాని ప్రాంత రైతులు రాం మాధవ్ ను కలిసారు. రాజధాని తరలించకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని అభ్యర్దించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 40 వేలతో ఎలా బతకాలో ముఖ్యమంత్రి ఆలోచన చేయాలని కోరారు. తాము రాజధాని కోసం భూములు ఇచ్చామని..ఇక్కడ ఒక వర్గం వారే ఉన్నారనే విధంగా ప్రచారం చేయటం సరి కాదన్నారు. రాజధాని తరలిస్తే తమకు జరిగే నష్టాన్ని వారు రాం మాధవ్ కు వివరించారు. వారి సమస్యలు విన్న తరువాత రైతులను ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే విధంగా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. రైతుల సమస్యల పట్ల తమ పార్టీ సానుకూలంగా ఉంటుందని అభయమిచ్చారు. త్వరలోనే ఏపీలో పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ఉంటాయని రాం మాధవ్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications