తెరమీదికి శ్రీబాగ్ ఒప్పందం: కర్నూలులో ఏపీ హైకోర్టు: మూడు రాజధానుల కోసం ఉద్యమాలు
విజయవాడ: శ్రీబాగ్ ఒప్పందం మళ్లీ తెర మీదికి వచ్చింది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేపట్టడం, మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకోవడం వంటి పరిణామాల మధ్య మూడు ప్రాంతాల్లోనూ ఉద్యమాలు మొదలయ్యాయి. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇదివరకే ఉత్తరాంధ్ర ఐక్యకార్యాచరణ కమిటి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు వంత వచ్చింది.

శ్రీబాగ్ ఒప్పందం అమలు కోసం..
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం.. రాష్ట్ర రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అది కుదరకపోతే కనీసం హైకోర్టును ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతరం రాజధానిగా కర్నూలును ప్రకటించకుండా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అయిదేళ్ల తెలుగుదేశం పార్టీ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు. డిజైన్ల కోసమే కాలం వృధా చేసిందనేది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే మూడు రాజధానుల కాన్సెప్ట్ను తీసుకొచ్చింది.

విశాఖను రాజధానిగా బదలాయించడానికి..
రాజధానిని నిర్మించడానికి భారీగా నిధులు అవసరం కానున్నందున- ఇప్పటికే అన్నిరకాల మౌలిక వసతులు ఉన్న విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రూపొందించిన బిల్లు చట్టపరమైన అడ్డంకులు ఏర్పడటంతో దాన్ని ఉపసంహరించుకుంది. మెరుగైన బిల్లుతో వస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. బిల్లు ఉపసంహరణ కాస్తా ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులను ఆందోళనలోకి నెట్టింది.

అందుకే.. పోరుబాట
ఈ కారణంతో రాయలసీమ ప్రాంత ప్రజలు పోరుబాట పట్టారు. శ్రీబాగ్ ఒప్పందంలో పొందుపరిచిన విధంగా ఏపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. విజయవాడ ధర్నాచౌక్లో ఆందోళన చేపట్టారు. రాయలసీమ ధర్మదీక్ష పేరుతో ఈ ఆందోళ కొనసాగింది. రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక, రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. కర్నూలులో ఏపీ హైకోర్టును నెలకొల్పే విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయకూడదంటూ నినదించారు.
Recommended Video

ప్రభుత్వ నిర్ణయంతో గందరగోళం..
బిల్లు ఉపసంహరణ అనంతరం రాయలసీమలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు న్యాయ రాజధానిగా మారుతుందంటూ ఆశించిన ఈ ప్రాంత ప్రజలు- ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళనకు గురయ్యారు. మరింత మెరుగైన బిల్లులను తీసుకొస్తామంటూ చేసిన హామీని వైఎస్ జగన్ వీలైనంత త్వరగా అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలనే తమ అకాంక్షలను తెలియజేయడంలో భాగంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనను కొనాగిస్తామని స్పష్టం చేశారు. న్యాయ, ప్రజా సంఘాలతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications