ఇసుక విధానమే ప్రభుత్వ పతనానికి నాంది : పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాన్ మరోసారి ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానంపై మండిపడ్డారు. ఇసుక సమస్య వైసీపీ ప్రభుత్వం పతనానికి నాంది అవుతుందని ఆయన హెచ్చరించారు. తాను ఇసుకు విధానంపై లాంగ్ మార్చ్ చేస్తున్నందు వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అన్నారు. 3వ తేదీన చేపట్టిన నిరసనని పక్కదోవ పట్టించేందుకు ఏదో ఒక ప్రకటన చేస్తారని అన్నారు. ఇక టీడీపీపై కక్షతో ప్రభుత్వం కూలీల పొట్టకొడుతుందని ఆయన విమర్శించారు.
గురువారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘంప్రతినిధులతో జనసేనాని సమావేశం అయ్యారు. ఈనేపథ్యంలోనే ఆయన వైసీపీ ప్రభుత్వ విధానాలపై మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకంటే తీసేసిన ఉద్యోగాలే ఎక్కువని ఈ సంధర్భంగా అన్నారు. ఏపీలోని లక్షల మంది కార్మికులు రోడ్డున పడితే ఇక్కడి రాజకీయ వ్యవస్థకు పౌరుషం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అన్నిపార్టీలు ఎకమయ్యాయని అన్నారు.
విదేశాల్లో కార్మికుల రక్షణకు ఎన్నో బలమైన చట్టాలు ఉంటాయని చెప్పిన పవన్ కళ్యాన్, వారి సమస్యల పరిష్కారం కోసం అండగా నిలిచేందుకు, వారి బరువు పంచుకునేందుకు జనసేన పార్టీ అండగా ఉంటుందని అభయం ఇచ్చారు. ఇసుక కార్మికులకు పెద్దన్నయ్యలా వ్యవహరిస్తానని చెప్పారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. పార్టీని ప్రతికూల పరిస్థితుల్లో స్థాపించానని చెప్పారు. దీంతో తానేప్పుడు గెలుపును ప్రామాణికంగా చూడనని, విలువలను మాత్రమే చూస్తానని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి అధికారం ఉండాలి తప్ప, వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి అధికారం ఉపయోగించకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు.