గన్నవరంలో 144 సెక్షన్- చిక్కుల్లో టీడీపీ నేత పట్టాభి: కోర్టుకు సాక్ష్యాధారాలు..!!
వైఎస్ఆర్సీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులతో హీటెక్కిన గన్నవరంలో పోలీసు అధికారులు 144 సెక్షన్ ను విధించారు. టీడీపీ నేత పట్టాభి రామ్ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు చల్లారట్లేదు. గన్నవరం చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్నారు. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్ చేశారు. మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుంటోంది. 144 సెక్షన్ ను విధించింది. 30 పోలీస్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చింది.
గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీపై తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలు చేశారనే కారణంతో ఆయన వర్గీయులు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆఫీస్ ఆవరణలో పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. దీనితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వరుస ఘటనలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. డీజీపీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్నాడని విమర్శించారు.

కాగా- కిడ్నాప్ అయినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించిన అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆయనతో పాటు మరో 16 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని న్యాయస్థానం సమక్షానికి హాజరు పర్చనున్నారు. గన్నవరం చేరుకోవడానికి ప్రయత్నించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. చిల్లకల్లు వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమ వాహనంలో విజయవాడ తరలించారు.
అలాగే పట్టాభిరామ్ భార్య చందనను హౌస్ అరెస్ట్ చేశారు. మంగళగిరిలోని పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యలయానికి వెళ్లడానికి ఆమె ప్రయత్నించారు. తనవెంట పలువురు టీడీపీ కార్యకర్తలను తీసుకుని మంగళగిరి డీజీపీ ఆఫీస్ ను ముట్టడించడానికి ప్రయత్నించిన కారణంగా చందనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. దీనితో ఆమె నిరసనకు దిగారు. ఇంట్లోనే బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పట్టాభిరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. విధుల్లో ఉన్న పోలీసులపైకి టీడీపీ నాయకులు, కార్యకర్తలను దాడి చేసే పట్టాభిరామ్ పురిగొల్పాడని, బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేశారని వివరించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications