రూ.500 కోట్ల స్కామ్: ఆ పథకం పేదల కోసమా? చంద్రబాబు మరో లేఖ: ఈ సారి ఎవరికంటే?
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో లేఖను సంధించారు. రెండు రోజుల కిందటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మూడు పేజీల లేఖను రాసిన చంద్రబాబు.. ఈ సారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తాజాగా లెటర్ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పథకంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే పథకం ఎవరి కోసం ప్రభుత్వం అమలు చేస్తోందంటూ ప్రశ్నించారు.
Recommended Video
గంటల వ్యవధిలో: మోడీకి చంద్రబాబు..స్మృతి ఇరానీకి నారా లోకేష్ లేఖాస్త్రాలు: పునరుద్ధరణ కోసం
పేరుకు మాత్రమే
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పథకంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. పేరుకు మాత్రమే పేదలకు ఇళ్ళస్థలాల పథకం అని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు దోచిపెట్టే పథకంలా మారిందని విమర్శించారు. పేదల పేరుతో ప్రభుత్వ ఖజానాను కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. అత్యంత విలువైన, పర్యావరణనానికి ప్రయోజనాన్ని కలిగించే చిత్తడి భూములను అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకుంటున్నారని, వాటిని ప్రభుత్వానికి విక్రయిస్తూ కోట్ల రూపాయలను కాజేస్తున్నారని ఆరోపించారు.
500 కోట్ల స్కాం
పేదలకు ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయడానికి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ మండలం బూరుగుపూడిలో 600 ఎకరాల చిత్తడి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని అన్నారు. ఒక్కో ఎకరాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం 45 లక్షల రూపాయలను ఖర్చు చేసిందని ఆరోపించారు. ఫలితంగా 270 కోట్ల రూపాయల నష్టం ఖాజానాకు వాటిల్లిందని అన్నారు. అనంతరం ఇవే భూములను కొనుగోలు చేయడానికి మరో 250 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని అన్నారు.
చిత్తడి భూముల్లో నివాసాలను ఏర్పరచుకుంటే..
చిత్తడి భూముల్లో ప్రజలు నివాసాలను ఏర్పరచుకుంటే.. ప్రమాదాలకు దారి తీస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. పర్యావరణ చట్టాలు కూడా దీనికి అనుమతించవని చెప్పారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల్లో వర్షపునీరు నిలిచిందని, పేదలు ఇళ్లను కట్టుకున్న తరువాత కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. తెనాలి, వినుకొండ, కావలి, పాలకొల్లు, పెందుర్తి, చౌడవరం, అద్దంకి, పెనమలూరు వంటి పలు చోట్ల ఇవే తరహా అక్రమాలు చోటు చేసుకున్నాయనే విషయం తన దృష్టికి వచ్చిందని, నివాసానికి ఏ మాత్రం ఉపయోగకరంగా లేని ప్రదేశాలను కూడా అధిక ధరను పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసిందని అన్నారు.
సమగ్ర దర్యాప్తు అవసరం..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇవే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. వాటిపై సమగ్ర విచారణను జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేక కమిటీని వేసి దర్యాప్తు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నివాసయోగ్యం కాని ముంపు ప్రాంతాల్లోని భూములను ఎకరానికి అయిదు లక్షల రూపాయల విలువ కూడా చేయని ఆవ భూములను వైఎస్ఆర్సీపీ నేతలు ఎకరానికి 45 లక్షల రూపాయలకు ప్రభుత్వంతో కొనిపించారని, ఈ ప్రక్రియలో భారీగా కమీషన్లను దండుకున్నారని అన్నారు. ఇలాంటి స్కామ్ లు రాష్ట్రమంతా చోటు చేసుకున్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపించి, ప్రజాధనాన్ని కాపాడాలని చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డిమాండ్ చేశారు.