టీడీపీ క్యాడర్కు బిగ్ బూస్ట్ - నారా లోకేష్ పాదయాత్ర కోసం పాటల షూటింగ్
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్- పాదయాత్రకు పూనుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం మొదలుకుని క్షేత్రస్థాయి క్యాడర్ వరకు పార్టీలో జోష్ నింపే ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనికోసం పార్టీ నాయకులు పాటలను చిత్రీకరించే పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ పాటల చిత్రీకరణ సాగుతోంది.

కోలుకునే ప్రయత్నం..
2019 సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ ఇచ్చాయి. దీని నుంచి కోలుకోవడానికి ఆ పార్టీ అగ్రనాయకత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినప్పటికీ- అంచనాలకు అనుగుణంగా ఫలితాలను రాబట్టుకోలేకపోతోంది. 2019లో తరువాత ఎదుర్కొన్న అన్ని ఎన్నికలు కూడా టీడీపీకి చేదు ఫలితాలనే ఇచ్చాయి. తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిది టీడీపీ.

అన్ని ఎన్నికల్లో
ఆ తరువాత కడప జిల్లా బద్వేలు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. వివిధ కారణాలతో ఉప ఎన్నికలకు దూరంగా నిలిచింది. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన పరాజయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అనూహ్య అపజయాలను ఎదుర్కొంది. తాడిపత్రి మినహా రాష్ట్రంలో ఏ ఒక్క మున్సిపాలిటీని గెలుచుకోలేదు.

వరుస వలసలు..
అదే సమయంలో- సీనియర్ నాయకులు పార్టీని వీడటం మొదలు పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా దీనికి మినహాయింపు కాదు. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తాజాగా టీడీపీకి గుడ్బై చెప్పడానికి సిద్ధం అయ్యారు. చీరాల, గన్నవరం, గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, వల్లభనేని వంశీ, మద్దిల గిరిధర్ రావు పార్టీకి దూరంగా ఉంటోన్నారు. వారంతా బాహటంగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు.

వరుస ఓటములతో టీడీపీ డీలా..
ఆయా పరిణామాలతో గ్రామస్థాయిలో టీడీపీ డీలా పడిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అత్యంత కీలకంగా మారిన 2024 సార్వత్రిక ఎన్నికలను టీడీపీ ఎలా ఎదుర్కొంటుందనే ఆసక్తి రేపుతోంది. పార్టీలో జోష్ నింపడానికి నారా లోకేష్- పాదయాత్రకు దిగనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడానికి పూనుకున్నారు.

పాదయాత్ర కోసం..
రాష్ట్రంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల మీదుగా సాగేలా టీడీపీ అగ్ర నాయకత్వం రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తోంది. వచ్చే సంవత్సరం జనవరి 27వ తేదీన కుప్పంలో తొలి అడుగు వేయనున్నారు నారా లోకేష్. దీనికోసం ఆయన సన్నద్ధమౌతోన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటి వరకు ఈ పాదయాత్ర ద్వారా జనం మధ్యే ఉండనున్నారు.

జోష్ నింపేలా..
ఈ పాదయాత్ర నేపథ్యంలో- పార్టీ క్యాడర్లో జోష్ నింపడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పాటల చిత్రీకరణలో బిజీగా ఉంటోన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని గుర్తు చేస్తూ లిరిక్స్ రాశారు. ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాటల చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

రాఘవేంద్రరావు, బోయపాటి..
రాష్ట్రాభివృద్ధి, అమరావతి రైతుల పోరాటం, వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నట్లుగా చెబుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఆధారంగా పాటలను రాసుకున్నారు. కే రాఘవేంద్ర రావు, బోయపాటి శ్రీను దర్శకత్వ పర్యవేక్షణలో ఈ పాటలు చిత్రీకరణను జరుపుకొంటోన్నాయి. దీనిపై వైఎస్ఆర్సీపీ నుంచి విమర్శల దాడి మొదలైంది కూడా. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ఈ పాటలపై విమర్శలు గుప్పించారు. తెలుగు డ్రామాల పార్టీ కామెడీ షో పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడంలా ఉందని విమర్శించారు.












Click it and Unblock the Notifications