చంద్రబాబు అంతటి నేతకే చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ ఎంపీ..!!
విజయవాడ: సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ములాయం కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది పార్టీ సీనియర్ నేతలను చంద్రబాబు పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా సైఫయ్ వెళ్లారు.
ములాయం పార్థివ దేహానికి నివాళి..
ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా ఉత్తర ప్రదేశ్లోని సైఫయ్కి వెళ్లారు. సైఫయ్లో ప్రజల సందర్శనార్థం ఉంచిన ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఆ సమయంలో చంద్రబాబు వెంట లోక్సభ, రాజ్యసభ సభ్యులు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు ఉన్నారు. సైఫయ్లో ములాయం సింగ్ సోదరుడు రామ్గోపాల్ యాదవ్, కుమారుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఎంపీలు గైర్హాజర్..
ఈ సందర్భంగా చంద్రబాబు వెంట విజయవాడ, శ్రీకాకుళం లోక్సభ సభ్యులు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు లేరు. గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, కంభంపాటి రామ్మోహన్ మాత్రమే కనిపించారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యక్తిగత కారణాల వల్ల చంద్రబాబు వెంట ఉత్తర ప్రదేశ్కు వెళ్లలేదని చెబుతున్నారు. తాను అందుబాటులో ఉండట్లేదని పార్టీ అగ్ర నాయకత్వానికి ఆయన ముందే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఉద్దేశపూరకంగానే..
కేశినేని నాని మాత్రం ఉద్దేశపూరకంగానే చంద్రబాబు వెంట ఉత్తర ప్రదేశ్కు వెళ్లలేదని తెలుస్తోంది. ఆయన అందుబాటులో ఉన్నప్పటికీ రాలేనని సమాచారం ఇచ్చారని అంటున్నారు. సాధారణంగా చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్.. ఆయనను రిసీవ్ చేసుకుంటుంటారు. ఆ టూర్ ముగిసేంత వరకు ఆయన వెంటే ఉంటారు.
కేశినేని మళ్లీ..
అలాంటిది ఏకంగా ఇద్దరు ఎంపీలు డుమ్మా కొట్టడం.. అందులో ప్రత్యేకించి కేశినేని నాని ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీతో చాలాకాలంగా కేశినేని దూరంగా ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. తన అసహనాన్ని, అసంతృప్తిని బాహటంగా పార్టీ అగ్ర నాయకత్వం ముందే వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవలే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లగా- ఎయిర్పోర్ట్లో కేశినేని నాని ఆయనకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో అందరికీ తెలిసిన విషయమే.
సోషల్ మీడియా పోస్టులతో..
ఆ తరువాత కూడా అదే వైఖరిని కేశినేని కొనసాగిస్తూ వస్తోన్నారు. మొన్నటికి మొన్న తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లల్లో చేసిన చేసిన పోస్టులు వివాదాస్పదం అయ్యాయి. టీడీపీలో కలకలం రేపాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సమావేశాన్ని ఉద్దేశించి కూడా కేశినేని నాని ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును టార్గెట్గా చేసుకున్నారు. టీడీపీ సమావేశంలో దేవినేని ఉమా తొడగొట్టడంపై సెటైర్లు వేశారు.
మాజీమంత్రులపై..
తొడలు కొట్టి..మీడియాలో మాట్లాడినంత మాత్రాన లీడర్లెవరూ హీరోలు కాలేరని చురకలు అంటించారు. అక్కడితో ఆగలేదాయన. పార్టీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీమంత్రి నెట్టెం రఘురాంను ఉద్దేశించి కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి లిస్టు పంపిస్తాం.. రుజువులతో సహా చర్యలు తీసుకుంటారా మరి అంటూ కేశినేని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా ఏకంగా చంద్రబాబు పర్యటనకే డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.