టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దుండగుల దాడి .. వైసీపీ కుట్ర అంటూనే గాయాలతో ఆస్పత్రికి
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై విజయవాడలో దాడి జరిగింది. ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరుతుండగా పట్టాభి నివాసం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది వ్యక్తులు ఆయన కారును చుట్టుముట్టి రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పట్టాభికి కూడా గాయాలయ్యాయి. సుమారు పది మంది దుండగులు ఈ దాడిలో పాల్గొన్న స్థానికులు చెబుతున్నారు. గాయాలపాలైన ఆయనను ఆస్పత్రికి తరలిస్తున్నారు.

ఇంటి దగ్గర్లోనే కాపుకాసి టీడీపీ నేతపై దుండగుల దాడి
కార్యాలయానికి బయలుదేరే సమయంలో ఇంటి దగ్గర్లోనే కాపుకాసి కొందరు తనపై దాడి చేశారని, తన కారు పూర్తిగా ధ్వంసమైందని, డ్రైవర్ పై కూడా దాడికి పాల్పడ్డారని గాయాలపాలైన పట్టాభి తెలిపారు. గతంలో కూడా తన వాహనాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని పేర్కొన్న పట్టాభి తనపై జరిగిన దాడి వైసిపి చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు తాను భయపడనని, వాస్తవాలు బయటపెట్టడానికి ఎప్పుడూ వెనకడుగు వేయనని పట్టాభి స్పష్టం చేశారు.
సముద్రం ఒడ్డున బీర్ బాటిల్తో యంగ్ బ్యూటీ.. ఒయ్యారాలు ఒలికించిన ఆషికా రంగనాథ్

వైసిపి ప్రభుత్వ కుంభకోణాలు బయట పెట్టిన కారణంగానే తనపై దాడులు అన్న పట్టాభి
వైసిపి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న కుంభకోణాలు బయట పెట్టిన కారణంగా తనను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. గత పది రోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్న పట్టాభి, మీడియా ముఖంగా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్లానని, అయినప్పటికీ తనకు రక్షణ కల్పించ లేదని పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. మారణాయుధాలతో దాడి జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
జగన్ ప్రభుత్వం తనపై కుట్ర చేస్తోందని పట్టాభి ఆరోపణలు
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించుకోవాలని పేర్కొన్న పట్టాభి పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి సరెండర్ అయిపోయిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టాభి. గతంలోనూ 2 నెలల క్రితం ఆయన వాహనంపై దుండగులు దాడి చేశారు. అప్పుడు కూడా జగన్ ప్రభుత్వం తనపై కుట్ర చేస్తోందని ఆరోపణలు చేశారు పట్టాభి. ప్రస్తుతం గాయపడిన పట్టాభిని ఆస్పత్రికి తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications