పండుగ తర్వాత పార్టీ మార్పుపై స్పందిస్తానన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ .. ఏం చెప్తారో ?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారతారా అన్నది ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పార్టీలకి అతీతంగా మంచి పేరుంది. ఆ ఇమేజ్ తోనే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ జోరు కొనసాగినా కూడా ఆయనకు స్థానికంగా ఉన్న మంచి పేరుతో గన్నవరం లో విజయం సాధించారు. అలాంటి వంశీ పార్టీ మారతారన్న ఊహాగానాలు జోరందుకున్న నేపధ్యంలో టీడీపీకి టెన్షన్ పట్టుకుంది.

వంశీపై తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసు .. ఆగ్రహం వ్యక్తం చేసిన వంశీ
రాష్ట్రవ్యాప్తంగా గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ఓడిపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక అప్పటినుండి టిడిపి నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీపై కూడా నమోదయింది. కృష్ణాజిల్లా గన్నవరం టిడిపి ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ ఎన్నికల సమయంలో ఓటర్లకు దొంగ పట్టాలు పంపిణీ చేశారని ఆరోపణపై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేశారన్న ఆరోపణల మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఫోర్జరీ చేసింది తప్పుడు పత్రాలు అందించింది వైసీపీ నేతలే అని , వారు ఇచ్చిన తప్పుడు పత్రాలతో కేసులు ఎలా నమోదు చేస్తారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ నేత సుజానాతో భేటీ, ఆ వెంటనే జగన్ తో భేటీ
ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పార్టీ మారబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి ఆజ్యం పోస్టు వంశీ కూడా టీడీపీ అధికారికంగా చేసే ఏ కార్యక్రమాలలో పాల్గొనకుండా టిడిపి నుంచి బిజెపి పార్టీలో చేరిన సుజనా చౌదరితో భేటీ అవ్వడం,ఆ తర్వాత జగన్ తో భేటీ కావడం ఆయన పార్టీ మారుతున్నారు అన్న ఊహాగానాలకు ఊతం ఇస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్ తో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయిన విషయం ప్రధానంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో, వంశీ పార్టీ మారతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి.

నియోజకవర్గ సమస్యలు మాట్లాడటానికే సీఎంను కలిశానన్న వంశీ
అయితే వల్లభనేని వంశీ సీఎం జగన్ ని కలవడం నియోజకవర్గం గురించి మాట్లాడటానికే అని వంశీ పేర్కొన్నారు.అంతేకాదు తనపై తప్పుడు కేసులు బనాయించటం, తన అనుచరుల పై దాడులు చేయడం వంటి అనేక అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు గా తెలుస్తుంది. 2006లో తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన అనుచరులపై ఇప్పుడు జరిగినన్ని దాడులు ఎప్పుడూ జరగలేదని, నాలుగు నెలలుగా తన నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఈ విషయాలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చానని మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీ పేర్కొన్నారు.దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. జగన్ తో కలిసి పని చెయ్యటానికి వంశీ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.

దీపావళి పండగ తర్వాత పార్టీ మార్పుపై స్పందిస్తానన్న వంశీ
ఇక, పార్టీ మారే విషయమై ఆయన స్పందిస్తూ, దీపావళి పండగ తర్వాత తన పార్టీ మార్పు అంశం గురించి చెబుతానని స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ బిజెపి నేత ఎంపీ సుజనాచౌదరి తో భేటీ కావడం, ఆ తర్వాత వెంటనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏదేమైనా టిడిపి నేతలు కేసుల ఆందోళనలో ఉన్న నేపథ్యంలో వల్లభనేని వంశీ కూడా కేసులకు భయపడి పార్టీ మారతారా? లేక టి డి పి లోనే కొనసాగుతారా? అనే విషయం తెలియాలంటే దీపావళి పండుగ తర్వాత స్పందిస్తానని చెప్పిన వల్లభనేని వంశీ స్పందనకోసం ఎదురు చూడాల్సిందే.












Click it and Unblock the Notifications