విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ 18న ప్రారంభం.. గడ్కరీ వస్తారంటూ కేశినేని నాని ట్వీట్...
విజయవాడ కనకదుర్గ ప్లై ఓవర్ ప్రారంభోత్సవం తేదీ మరోసారి ఖరారయ్యింది. ఈ నెల 18వ తేదీన ఫ్లై ఓవర్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. వాస్తవానికి ఈ నెల 4వ తేదీ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో వాయిదా పడింది. ప్రారంభోత్సవ తేదీని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు.

18వ తేదీన ప్రారంభం..
ఇటీవలే ఫ్లై ఓవర్కి సంబంధించి తీసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలైంది. అందులో విజయవాడ నగరం దాదాపుగా కనిపించింది. 18వ తేదీన ఫ్లై ఓవర్ ప్రారంభిస్తారని కేశినేని నాని ట్వీట్ చేశారు. ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని ప్రస్తావించారు. షెడ్యూల్ ప్రకారం 4వ తేదీన ఓపెన్ కావాల్సి ఉండగా.. గతనెల 31వ తేదీన సోమవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏడురోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. దీంతో ఈ నెల 7వ తేదీ వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దు. ఆ తర్వాత 11 రోజలకు మరో తేదీని నిర్ణయించారు. అయితే దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రకటన రాలేదు. విజయవాడ ఎంపీ మాత్రం ట్వీట్ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో అంకురార్పణ..
గత ప్రభుత్వ హయాంలోనే ఫ్లై ఓవర్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. కేంద్రం సాయంతో జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభించారు. అలా సాగుతూ.. ఇటీవల పూర్తయ్యింది. విజయవాడ బస్టాండ్ నుంచి పున్నమి ఘాట్ వరకూ 2.3 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.440 కోట్లతో పనులు చేపట్టారు. విజయవాడ బస్టాండ్ దాటాక కృష్ణానదిని ఆనుకుని ప్రకాశం బ్యారేజీ పక్కనే గల కృష్ణా కాలువపై నుంచి సాగే ఫ్లైఓవర్ కనకదుర్గ గుడి వద్ద ఏకంగా నదిలోకి వెళ్లిందా అనుకునేలా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న ఇరుకైన మార్గంలో ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మించే అవకాశం ఉందని ప్రజలు కూడా అనుకోలేదు. కానీ రాష్ట్రంలో అత్యంత పొడవైన ఫ్లై ఓవర్గా నిర్మాణం జరిగింది. జాతీయ రహదారిపై ఉన్న ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది.
Recommended Video
9 నెలల్లో నిర్మించాలి.. కానీ...
వాస్తవానికి 9 నెలల్లోనే ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తిచేస్తామని గత టీడీపీ ప్రభుత్వం బీరాలు పలికింది. అయితే కేంద్రం నుంచి సకాలంలో నిధులు మంజూరు కాలేదు. దీంతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి పచ్చాక కేంద్రంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో నిధుల విడుదలయ్యాయి. దీంతో ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసుకుంది.












Click it and Unblock the Notifications