నెగెటివ్ అన్నారు..ఇంటికెళ్లిన పదిరోజులకు పాజిటివ్: ఓ లారీ డ్రైవర్ వ్యథ
ఏపీలో కరోనా వైరస్ కేసుల వ్యవహారం ఓవైపు కలకలం రేపుతుండగానే... తాజాగా నెగెటివ్ అంటూ డిశ్చార్జ్ చేసిన బాధితులను సైతం తిరిగి పాజిటివ్ అంటూ ఆస్పత్రులకు రమ్మని కోరుతుండటం ఇప్పుడు వారి కుటుంబాల్లో భయాందోళనలు నింపుతోంది. ఓసారి నెగెటివ్ అని తేల్చి ఇళ్లకు పంపాక తిరిగి పాజిటివ్ అంటే అప్పటి వరకూ ఇళ్లలో తమ తాము గడిపిన కుటుంబ సభ్యుల పరిస్ధితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
విజయవాడ రామలింగేశ్వర నగర్ ప్రాంతానికి చెందిన ఓ లారీ డ్రైవర్ మార్చి చివరి వారంలో ప్రభుత్వ అనుమతితో వ్యవసాయ ఉత్పత్తులను తీసుకుని తెలంగాణ వెళ్లి ఈ నెల 16న తిరిగి వచ్చాడు. ఇంట్లో ఇద్దరు ఐదేళ్ల లోపు చిన్నారులు ఉండటం, భార్య గర్భవతిగా ఉండటం, ముసలివారైన తల్లితండ్రులు ఉండటంతో ముందుజాగ్రత్తగా నేరుగా క్వారంటైన్ కు వెళ్లాడు. పది రోజుల పాటు అక్కడే చికిత్స తీసుకున్నాక పరీక్షలు చేసిన డాక్టర్లు నెగెటివ్ గా తేల్చడంతో డిశ్చార్జ్ అయ్యాడు.
Recommended Video
ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చాక ఇక కరోనా తగ్గిపోయిందని భావించి చిన్నారులు, కుటుంబ సభ్యులతో పది రోజులు సంతోషంగా గడిపాడు. ఆ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిందంటూ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే కుప్పకూలిపోయాడు. అధికారుల ఒత్తిడితో చిన అవుటపల్లిలోని కోవిడ్ 19 ఆస్పత్రిలో చేరాడు. ఓసారి నెగెటివ్ అని తేల్చాక మళ్లీ పాజిటివ్ అని ఎలా చెబుతారని, ఈ పది రోజులు తనతో సంతోషంగా గడిపిన కుటుంబ సభ్యుల పరిస్ధితి ఏంటని ఆ లారీ డ్రైవర్ వేస్తున్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు.