తన వల్ల కాలే.. విశ్వరూప్ చేయాలి.. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల గురించి పేర్ని నాని
మంత్రి పదవీ వీడిన పేర్ని నాని.. తెలంగాణపై అటాక్ మానలేదు. ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఇదివరకు నిర్వహించిన మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడారు. మూడేళ్లు కష్టపడిన ఓ విషయంలో ఫలితం సాధించలేకపోయానని చెప్పుకొచ్చారు. తీవ్రంగా యత్నించినా... తెలంగాణ రాష్ట్రం నుంచి సహకారం లేదని పేర్కొన్నారు. దీంతో ఆ పనిలో ఫలితం రాబట్టలేకపోయానని వెల్లడించారు.
ఇటీవలే జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పేర్ని నాని మంత్రి పదవీ కోల్పోయారు. ఆయన నిర్వహించిన రవాణా శాఖకు కొత్త మంత్రిగా పినిపే విశ్వరూప్ బాధ్యతలు చేపట్టారు. పేర్ని నారి, పినిపే విశ్వరూప్లను మంగళవారం నాడు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సన్మానించింది. తెలంగాణ, ఏపీ మధ్య లారీల రవాణాకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఉంటే బాగుంటుందని లారీ ఓనర్లు గతంలో తనకు చెప్పారని తెలిపారు. దానిపై సమాలోచనలు చేసిన తాను కూడా ఆ పర్మిట్లు ఇరు రాష్ట్రాల లారీ ఓనర్లకు ఉపయోగం ఉంటుందని భావించానని తెలిపారు.
పర్మిట్ల కోసం తెలంగాణ ప్రభుత్వంతో చర్చించేందుకు తీవ్రంగా యత్నించానన్నారు. తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. కనీసం తెలంగాణ రవాణా శాఖ అధికారి కూడా తనతో చర్చించేందుకు ఆసక్తి చూపలేదన్నారు. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లతో ఏపీ లారీ ఓనర్ల కంటే కూడా తెలంగాణ లారీ ఓనర్లకే అధిక ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలిపినా ప్రయోజనం లేకపోయిందన్నారు. దీంతో పర్మిట్ల కోసం తాను మూడేళ్లుగా కష్టపడ్డా ఫలితం సాధించలేకపోయానని పేర్కొన్నారు. కొత్తగా రవాణా శాఖ బాధ్యతలు చేపట్టిన పినిపే విశ్వరూప్ ఈ పర్మిట్లను సాధించేందుకు కృషి చేయాలని నాని కోరారు. చూడాలీ విశ్వరూప్ నేతృత్వంలో అయినా ఆ పని జరుగుతుందో లేదో మరీ.