స్పీకర్ పవరేంటో చూపిస్తానన్న తమ్మినేని... న్యాయ, శాసన వ్యవస్ధల మధ్య ఘర్షణ తప్పదా ?
ఏపీలో ఇప్పటివరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడిన హైకోర్టు తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని ఈసారి మాత్రం తాడోపేడో తేల్చేందుకు సిద్దంగా ఉన్నట్లు చేసిన హెచ్చరికలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా సెలక్ట్ కమిటీ వ్యవహారంలో హైకోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నట్లు ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తుంటే శాసన వ్యవస్ధకు ఉన్న అధికారాలపై మరోసారి విస్తృత చర్చ జరగడంతో పాటు న్యాయవ్యవస్ధతో మరో ఘర్షణ తప్పలా లేదనే చర్చ సాగుతోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్లో కోర్టుల జోక్యంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన స్పీకర్.. ఈ సారి హైకోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే మాత్రం తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రతిష్టాత్మంగా మూడు రాజధానులు..
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రభుత్వంలో భాగమైన శాసన వ్యవస్ధకూ ఇది ప్రతిష్టాత్మకంగానే కనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఇప్పటికే రెండుసార్లు ఆమోదించి పంపిన రాజధాని బిల్లులకు కేంద్రంతో పాటు న్యాయనిపుణులు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. కానీ దీన్ని కోర్టులో సవాలు చేయడం, సెలక్ట్ కమిటీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో శాసనసభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓసారి కార్యనిర్వాహక, శాసన వ్యవస్ధలు ఆమోదించి పంపిన దస్త్రాలను రాజ్యాంగ నిబంధల పేరిట టీడీపీ కోర్టుల్లో ప్రశ్నించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని ఈ బిల్లుల విషయంలో తానెంత సీరియస్గా ఉన్నానో చెప్పకనే చెప్పారు.

హైకోర్టులో తేడా వస్తే...
సెలక్ట్ కమిటీ వద్ద రాజధాని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఓసారి, అసలు సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయలేదని మరోసారి టీడీపీ చేస్తున్న వాదనను తీవ్రంగా తప్పుబడుతున్న స్పీకర్ తమ్మినేని ఈ వాదనను ఆధారంగా చేసుకుని రేపు హైకోర్టు ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే శాసన వ్యవస్ధ అధికారాలను తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శాసన వ్యవస్ధ తనకున్న అధికారాలతో ఆమోదించి పంపిన బిల్లులను మండలి సెలక్ట్ కమిటీకి పంపిందన్న పేరుతో అడ్డుకోవాలని చూస్తే అది అంతిమంగా వ్యవస్ధల మధ్య ఘర్షణలకు దారి తీస్తుందనే వాదనను స్పీకర్ తెరపైకి తెస్తున్నారు.

న్యాయ, శాసన వ్యవస్ధల మధ్య ఘర్షణ..?
ప్రస్తుతం తాజా పరిస్ధితులను చూస్తుంటే సెలక్ట్ కమిటీ వ్యవహారంలో హైకోర్టు ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే మాత్రం శాసనసభకు ఉన్న అధికారాలను తెరపైకి తీసుకురావడం ద్వారా దాన్ని తీవ్రంగా ప్రతిఘటించే యోచనలో స్పీకర్ ఉన్నట్లు అర్ధమవుతోంది. అప్పుడు న్యాయ, శాసన వ్యవస్ధల మధ్య పరోక్షంగా వ్యక్తమవుతున్న అసంతృప్తులు కాస్తా ఘర్షణ రూపు సంతరించుకునే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి శాసన, న్యాయ వ్యవస్ధల మధ్య ఘర్షణలు ఏపీతో పాటు దేశంలోనూ కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి పరిస్ధితులు తలెత్తినప్పుడు సంయమనం, లౌక్యం ప్రదర్శించడం ద్వారా ఈ రెండు వ్యవస్ధలూ వివాదాలను పరిష్కరించుకున్న సందర్భాలూ ఉన్నాయి.
Recommended Video

కోర్టు తీర్పులు ఏం చెప్పాయి ?
గతంలో న్యాయ, శాసన వ్యవస్ధల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు అత్యున్నత న్యాయస్ధానం పలుమార్లు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. చట్ట సభల నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోజాలవని గతంలో అత్యున్నత న్యాయస్ధానం రాజారామ్ పాల్ వర్సెస్ లోక్సభ కేసులో చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత వివిధ చట్ట సభలు కూడా తమ నిర్ణయాల్లో కోర్టుల జోక్యం ఉండకుండా రూలింగ్ కూడా ఇచ్చాయి. ఏపీలోనూ 1997లో స్పీకర్గా యనమల రామకృష్ణుడు కూడా ఇదే రూలింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రూలింగ్ అమల్లో ఉందని, దాన్ని కొనసాగించాలో వద్దో కూడా పదే పదే అసెంబ్లీ వ్యవహారాలపై కోర్టులకు వెళ్తున్న టీడీపీయే చెప్పాలని ప్రస్తుత స్పీకర్ తమ్మినేని చేస్తున్న వాదన కూడా సహేతుకంగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications