ఏపీ మంత్రి కొడాలి నాని మౌనం వెనుక... రాజధాని వివాదం తర్వాత ఏం జరిగింది ?
ఏపీలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు పేరెత్తితేనే బూతులతో విరుచుకుపడే మంత్రి కొడాలి నాని కొంతకాలంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. గతంలో రాజధాని తరలింపుతో పాటు పలు కీలక అంశాలపై నిత్యం మాట్లాడిన కొడాలి... తాజాగా పూర్తిగా మౌనంగా ఉంటున్నారు. మీడియా దృష్టిలో పడితే ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందని భావించారో ఏమో సచివాలయానికి కూడా రావడం తగ్గించేశారు. దీంతో ఇప్పుడు కొడాలి మౌనంపై సర్వత్రా జరుగుతోంది.

చంద్రబాబు పేరెత్తితే చాలు...
ఒకప్పుడు నందమూరి హరికృష్ణ అనుచరుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి అనంతరం టీడీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నప్పటికీ అధినేత చంద్రబాబు దూరంగా ఉంచడంతో మొదలైన కొడాలి నాని అలక చివరికి ఆయన్ను పార్టీకి దూరం చేసేసింది. తన గురువు హరికృష్ణకు జరుగుతున్న అవమానాలను ప్రశ్నించి చంద్రబాబు దృష్టిలో విలన్ అయిన కొడాలి ఆ తర్వాత పార్టీని వీడటమే కాక అదే చంద్రబాబుపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. చివరికి వైసీపీలో చేరిపోయిన కొడాలి తన నియోజకవర్గం గుడివాడ నుంచి టీడీపీని తట్టుకుని మరీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక...
2014 ఎన్నికలకు ముందే వైసీపీలోకి వచ్చిన కొడాలి నాని తన సొంత నియోజకవర్గం గుడివాడలో టీడీపీకి చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. నానిని ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డిన టీడీపీ ప్రతీసారి విఫలమవుతూనే వస్తోంది. 2019లోనూ అదే సీన్ రిపీటయింది. ఆ తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా దక్కించుకున్న కొడాలి నాని.. విపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలపై నేరుగానే విరుచుకుపడటం మొదలుపెట్టారు. చంద్రబాబును ఆయన తనయుడు లోకేష్ పై బూతుల పురాణంతో విరుచుకుపడే నానిని కంట్రోల్ చేయడం సొంత పార్టీ నేతలకు సైతం కష్టమైపోయిన పరిస్ధితి.

రాజధాని తరలింపు వ్యవహారంలోనూ..
ఏపీ రాజధానిని వికేంద్రీరణలో భాగంగా అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న నిర్ణయం తీసుకున్నాక సైతం ప్రభుత్వానికి అండగా నిలిచిన కొడాలి నాని, చంద్రబాబు ఏం అబివృద్ధి చేశాడని ఇక్కడ ఉండాలని ప్రశ్నించారు. అంతే కాదు కమ్మ సామాజిక వర్గానికి అమరావతి, విశాఖ రూపంలో రెండు రాజధానులు రాబోతున్నాయని అసెంబ్లీలో ప్రశంసించారు. దీంతో కొడాలి స్పీచ్ లు సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్ అయ్యేవి. ఓ దశలో అమరావతికి వ్యతిరేకంగా కొడాలి చేసిన వ్యాఖ్యలపై కృష్ణాజిల్లాకు చెందిన ఆయన సామాజికవర్గానికే చెందిన మహిళ ఒకరు బూతుపురాణం అందుకోవడంతో ఆమెపై పోలీసులు కేసులు పెట్టారు. చివరికి ఈ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది.
Recommended Video

సొంత సామాజికవర్గంలో వ్యతిరేకత..
స్వతహాగా కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని తన సంచలన వ్యాఖ్యలతో అందరికీ చేరువయ్యారు. కానీ తమను టార్గెట్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత సామాజికవర్గాన్ని ఇరుకున పెట్టాయి. దీంతో ఆయన కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం గత 10 నెలల కాలంలో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇవన్నీ వారిలో జగన్ పట్ల, వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత కలిగించాయి. అదే సమయంలో కొడాలి నాని వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోయడంతో ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు జోక్యం చేసుకుని నానితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు, పార్టీలతో సంబంధం లేకుండా నాని వ్యాఖ్యలపై ఎదురవుతున్న వ్యతిరేకతపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే సామాజిక వర్గానికి చెందిన విపక్ష నేత చంద్రబాబు కుటుంబాన్ని సమర్ధించకపోయినా పర్వాలేదు మౌనంగా ఉంటే చాలని కొడాలికి వారు నచ్చజెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన కొంతకాలంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.












Click it and Unblock the Notifications