ఏపీ సీఎం జగన్ ను ఇరకాటంలో పెట్టేలా వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ... అసలు కథేమిటి అంటే
ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ పాలన పరంగా ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే ఇసుక విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అంచనా తప్పింది. ఆయన తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు అప్పటినుండి ఇప్పటివరకు దుమ్మెత్తి పోస్తున్నాయి. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల నేటికి ఇసుక కొరత తీరలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన దీక్షలు సైతం కొనసాగుతున్న పరిస్థితి ఏపీలో నెలకొంది. ఇక ఇదే సమయంలో జగన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో వైసీపీ నేతలందరూ కూడా ఏకిభవిస్తుంటే, తాజాగా ఒక నేత చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పెడుతున్నాయని తెలుస్తుంది.

సొంతపార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
ఇటీవల మహిళా అధికారిణితో దురుసుగా ప్రవర్తించారని నెల్లూరుకు చెందిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇక దీంతో శ్రీధర్ రెడ్డి అరెస్టు కూడా జరిగింది. అప్పటినుండి శ్రీధర్ రెడ్డి మాటల్లో చాలా తేడా కనిపిస్తుంది. సొంత పార్టీ మీద శ్రీధర్ రెడ్డి అక్కసు వెళ్ళగక్కుతున్నారు అన్న చర్చ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. తాజాగా సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

సామాన్యులకు అందకుండా ఇసుక దోపిడీ జరుగుతుందన్న ఎమ్మెల్యే
రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక కొరతపై మాట్లాడిన కోటంరెడ్డి ప్రభుత్వ విధివిధానాలను పక్కనపెడుతూ కొంతమంది ఇష్టారాజ్యంగా ఇసుక పాలసీ విధానాన్ని తమ సొంతానికి, తమ అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇక అంతే కాదు సామాన్యులకు ఇసుక అందకుండా దోపిడీకి పాల్పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు రూరల్ మరియు నగర ప్రజల ఇసుక కొరత పై తాను ప్రత్యక్ష పోరాటానికి దిగనున్నట్లుగా పేర్కొనడం వైసిపి వర్గాలను షాక్ కు గురి చేసింది.

నిర్మాణరంగ కార్మికుల కోసం ప్రత్యక్ష పోరాటం చేస్తానన్న కోటంరెడ్డి
భవన నిర్మాణ కార్మికుల కోసం, ప్రజల ఇక్కట్లను పరిష్కరించడం కోసం ప్రత్యక్ష పోరాటం చేస్తాననడం,అధికారంలో ఉన్న సొంతపార్టీ పైన ఆయన యుద్ధం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు రూరల్, నగర ప్రజల ఇక్కట్లు, భవన నిర్మాణ కార్మికుల బాధల్ని గమనించి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తాను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.

కాకాణి టార్గెట్ గానే పోరాటమా ? జగన్ కు తలనొప్పిగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు
అయితే గత కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితుల నేపధ్యంలో కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డికి మధ్య విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో ప్రస్తుతం కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాకాణి గోవర్ధన్ రెడ్డి టార్గెట్గానే చేసి ఉంటారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఇసుక కొరతపై ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు పోరాటం చేస్తున్న సమయంలో కోటంరెడ్డి కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని చెప్పడం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర అంశమే.












Click it and Unblock the Notifications