అదాని చేతికి: మొన్న గంగవరం పోర్ట్.. ఇక వైజాగ్ స్టీల్ప్లాంట్: కేంద్రం పావులు?
విశాఖపట్నం: దశాబ్దాల కాలం పాటు రాష్ట్రానికి తలమానికంగా ఉంటూ, ఉత్తరాంధ్ర ప్రజల జీవితంలో భాగంగా మారిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం.. ఇక ప్రైవేటు చేతుల్లో వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ దిశగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామని, వందశాతం మేర పెట్టుబడులను ఉపసంహరించి తీరుతామంటూ నిండు సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తరువాత.. దీనికి సంబంధించి ప్రక్రియ మరింత వేగవంతమైనట్టు చెబుతున్నారు.'
Recommended Video

అదాని చేతికే..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కొనుగోలు చేయడానికి గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలే అదాని గ్రూప్ సంస్థలకు చెందిన ప్రతినిధులు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించినట్లు సమాచారం. స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పెట్టుబడుల ఉపసంహరణ మార్గదర్శకాలకు అనుగుణంగా విశాఖ స్టీల్ప్లాంట్ను కొనుగోలు చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ సమాచారాన్ని అటు విశాఖ ష్టీల్ప్లాంట్ యాజమాన్యం గానీ, అదాని గ్రూప్ సంస్థలు గానీ ధృవీకరించలేదు.

గంగవరం పోర్ట్ తరువాత..
మొన్నటికి మొన్నే విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్ట్ను అదాని గ్రూప్ సంస్థలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పోర్ట్లో 58.1 శాతం మేర పెట్టుబడులను పెట్టింది. అదే సమయంలో- అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీ సెజ్) లిమిటెడ్ను ప్రకటించింది. గంగవరం పోర్ట్లో స్టేక్ను కొనుగోలు చేసిన తరువాత దేశంలోనే అతి పెద్ద పోర్టులు, లాజిస్టిక్ కంపెనీగా గుర్తింపు పొందింది. గంగవరం పోర్టులో డీవీఎస్ రాజు కుటుంబానికి చెందిన 58.1 శాతం స్టేక్ను 3,604 కోట్ల రూపాయలతో అదాని గ్రూప్ దక్కించుకుంది. గంగవరం పోర్ట్ తరువాత.. ప్రస్తుతం అదాని సంస్థల దృష్టి విశాఖ స్టీల్స్పై పడిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

పోస్కో పోయి.. అదాని వచ్చె
ఇది వరకు దక్షిణ కొరియాకు చెందిన పోస్కో గ్రూప్ కంపెనీ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేయొచ్చంటూ వార్తలు వెలువడ్డాయి. ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు కూడా. వారికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీని నెలకొల్పడానికి స్థలాన్ని కేటాయిస్తామని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్స్కు సంబంధించిన చర్చలేవీ తమ మధ్య రాలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం.. పోస్కో సంస్థకే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కట్టబెట్టేలా వైఎస్ జగన్.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చారని ఆరోపించింది. వైఎస్ జగన్ ఒత్తిడి మేరకే విశాఖ స్టీల్స్ను అమ్మకానికి పెట్టిందని విమర్శించారు.

తాజాగా అదాని గ్రూప్ సంస్థ తెర మీదికి
తాజాగా- పోస్కోకు బదులుగా అదాని గ్రూప్ సంస్థ తెర మీదికి ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉందనే విషయం గంగవరం పోర్ట్తో మరోసారి పరోక్షంగా బయటపెట్టుకున్నట్టయిందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులను కూడా అదాని గ్రూప్ సంస్థల ప్రతినిధులు ఇటీవలే కలిశారనే సమాచారం ప్రచారంలో ఉంది. ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications