విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియకు ముహూర్తం ఫిక్స్.. కౌంట్డౌన్ బిగిన్స్
విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో సాధించిన ఘన విజయం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రభుత్వం తీసుకునే అన్ని రకాల నిర్ణయాలకు ప్రజామోదం లభించినట్టుగా భావిస్తోందా ఆ పార్టీ. పంచాయతీ ఎన్నికల్లో ఆరంభమైన దూకుడు పట్టణాలు, నగరాల్లోనూ కొనసాగడం పట్ల అన్ని వర్గాలు, ప్రాంతాలకు చెందిన ప్రజలు తమను ఆదరిస్తున్నారనడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును నిదర్శనంగా చూపిస్తోంది. ఇక ఇదే ఊపులో ప్రభుత్వపరంగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను వేగంగా అమలు చేయడానికి సమాయాత్తమౌతోంది.

మే నెలలో తరలింపు ప్రక్రియ..
తొలి అడుగును పరిపాలనా రాజధానితోనే ఆరంభించనుంది జగన్ సర్కార్. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను సాగర నగరానికి తరలించే ప్రక్రియను ముమ్మరం చేయనుంది. తరలింపు పనులు ఇప్పటికే ఆలస్యం అయ్యాయని, ఇక జాప్యం చేయకూడదనే నిర్ణయానికొచ్చింది. ఇందులో భాగంగా- మే నెలలో తరలింపు ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. మే 6వ తేదీన తరలింపు ప్రక్రియను ప్రారంభించడమో.. లేదా అదే తేదీన విశాఖ నుంచే పరిపాలన సాగించడమో చేయాలనే కృతనిశ్చాయానికి వచ్చినట్లు సమాచారం.

క్యాంపు కార్యాలయం.. రాజ్భవన్ సహా
గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తొలి విడతలో విశాఖకు తరలివెళ్తాయని తెలుస్తోంది. ఈ రెండింటితో పాటు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం, కొన్ని కీలకమైన శాఖల ప్రధాన కార్యాలయాలు, విభాగాధిపతుల హెడ్ క్వార్టర్లు విశాఖకు తరలి వెళ్తాయని, దశలవారీగా మిగిలిన శాఖలు, హెచ్ఓడీల కార్యాలయాలను తరలిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి మే 6వ తేదీని ఎంచుకోవడానికి ప్రత్యేకించి ఎలాంటి కారణాలు లేవనే అభిప్రాయాలు ఉన్నాయి.

కర్నూలులో హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడు?
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాల్లో హైకోర్టును నెలకొల్పుతామని మున్సిపల్ ఎన్నికలకు ముందే ప్రకటించింది. హైకోర్టు భవనం, న్యాయ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పడు చేస్తారనేది ఇంకా నిర్ధారించలేదు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించిన తరువాతే.. ఈ పనులను పూనుకుంటారని సమాచారం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14వ తేదీన శంకుస్థాపన చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది.

భవనాల కోసం ఎదురు చూడకుండా..
అమరావతి నుంచి విశాఖపట్నానికి సచివాలయం, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల తరలింపు ప్రక్రియ ముఖ్యమంత్రి కార్యాలయంతోనే ఆరంభం కావచ్చనే అంటున్నారు. భవనాల కోసం వేచి ఉండాల్సిన పని లేదని, అరకొరగా సౌకర్యాలు ఉన్నప్పటికీ.. అందుబాటులో ఉన్న సముదాయాల నుంచి పరిపాలను ఆరంభిద్దామనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న భవనాల్లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం.. క్రమంగా దాన్ని అనుకూలంగా ఉన్న ప్రదేశానికి మార్చుకోవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications