రాజధాని కథ ముగియలేదు: జగన్కు నేతల సవాల్ - ఇప్పుడే వద్దన్న వైవీ సుబ్బారెడ్డి - లోకేశ్ శపథం
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. దీంతో అమరావతి కేవలం శాసన రాజధానిగా, కొత్త ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, జ్యూడీషియల్ రాజధానిగా కర్నూలులో ఏర్పాటయ్యేందుకు రూట్ క్లియరైంది. అయితే, ఈ అంశంపై ఏ ఇద్దరు నేతలూ ఒకలా స్పందించడం లేదు. వైసీపీలో కీలక నేత, సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి అనూహ్య కామెంట్లు చేశారు. కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ముఖ్యమంత్రికి సవాలు విసిరారు. టీడీపీ జాతీయ నేత నారా లోకేశ్ మరోసారి అమరావతి శపథం చేశారు.

కోర్టు కచ్చితంగా కొట్టేస్తుంది
మూడు రాజధానుల బిల్లుకు ఏపీ గవర్నర్ ఓకే చెప్పడం దురదృష్టకరమని, ఏపీ చరిత్రలో ఇదొక చీకటి రోజని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. అయితే, ఇల్లు అలకగానే పండుగ కాదని, ఇంతటితో రాజధాని కథ ముగిసిపోలేదని, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో జగన్ సర్కారు గవర్నర్ ఆమోదంతో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు ఎలాగైతే కొట్టేసిందో.. మూడు రాజధానుల విషయంలో కూడా అదే పరిస్థితి తలెత్తుతుందని జోస్యం చెప్పారు. మూడు రాజధానుల బిల్లు ఏపీ పునర్విభజన చట్టం, రాష్ట్రపతి ఆర్డర్ కు వ్యతిరేకంగా ఉన్నాయిని, ఇవి కోర్టుల్లో నిలబడలేవని అభిప్రాయపడ్డారు.

జగన్ - బీజేపీ దొంగాట
‘‘గత ఎన్నికలకు ముందు నుంచీ.. ఏపీ రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నానని జగన్ చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధాని ఉంటుందని, టీడీపీ దుష్ప్రచారాలను నమ్మోద్దని ఒక్కతీరుగా ప్రజల్ని వేడుకున్నారు. మేనిఫెస్టోలోగానీ, పార్టీలోగానీ నిర్ణయం తీసుకోకుండా రాజధానిని మార్చేస్తున్న జగన్ కు నిజంగా దమ్ముంటే.. ఇదే అంశంపై మళ్లీ ఎన్నిలకు వెళ్లాలి. వెంకటేశ్వరస్వామికే పంగనామాలు పెట్టిన బీజేపీ పెద్దలు జగన్ తో కలిసి ఆడుతోన్న దొంగాట ఇది''అని తులసి రెడ్డి ఫైరయ్యారు.

ఇప్పుడే తరలింపు వద్దు..
సీఎం జగన్ బాబాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాజధాని బిల్లుల ఆమోదంపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అతిత్వరలోనే రాజధాని విశాఖకు తరలిపోనుందన్న ఇతర వైసీపీ నేతలకు భిన్నంగా.. ‘‘అమరావతి నుంచి విశాఖకు రాజధానిని ఇప్పుడప్పుడే తరలించొద్దు''అని ఆయన సూచించారు. దీనిపై సీఎం జగన్ సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

కరోనా తర్వాతే విశాఖకు..
‘‘కొంతకాలంగా ప్రపంచమంతా కరోనాతో సతమతమవుతోంది. ఇప్పటికిప్పుడు విశాఖకు రాజధాని తరలించే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. మహమ్మారి బారి నుంచి ప్రజల్ని కాపాడటంపైనే సీఎం జగన్ దృష్టిపెట్టారు. కావున, రాజధాని తరలింపు అనేది ఏమంత ముఖ్యం కాదు. కరోనా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతే రాజధాని తరలింపు ఉంటుంది'' అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానులు ప్రకటించామని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
Recommended Video

అమరావతికే లోకేశ్ ఓటు..
మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం పట్ల ప్రతిపక్ష టీడీపీ నేతలు భగ్గున మండుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. ‘‘ఒక రాష్ట్రం - ఒకటే రాజధాని'' టీడీపీ విధానమని, అభివృద్ధి వికేంద్రీకరణకు ఎప్పటికీ కట్టుబడి ఉంటామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని, ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications