టాప్గేర్లో జగన్: ఆ ఫీడ్బ్యాక్తో: జిల్లాల పర్యటనలతో: ఇక జనం మధ్యే: ఎల్లుండే వైజాగ్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గేరు మార్చారు. టాప్ గేర్లో దూసుకెళ్తోన్నారు. ఇటీవలే ముగిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో రాష్ట్రస్థాయి ప్లీనరీ ఊహించిన దాని కంటే విజయవంతమైందటూ పార్టీ నాయకుల నుంచి ఫీడ్ బ్యాక్ అందిన నేపథ్యంలో ఇక మరింత ఉత్సాహంతో ఆయన జిల్లాల పర్యటనల్లో పాల్గొనబోతోన్నారు. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం.

మొన్న కర్నూలు..
వైఎస్ జగన్ ఇటీవలే కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు. మూడో విడత జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. దీని విలువ 931 కోట్ల రూపాయలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 47,40,421 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఈ కిట్స్ పంపిణీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. జగనన్న విద్యా కానుక పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం 2,368 కోట్ల రూపాయలను వ్యయం చేసింది ప్రభుత్వం.

ఇక వాహన మిత్ర కోసం..
ఇక తాజాగా వైఎస్సార్ వాహన మిత్ర కింద నిధులను విడుదల చేయడానికి వైఎస్ జగన్ సన్నాహలు చేపట్టారు. ఎల్లుండి ఆయన విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. వాహన మిత్ర కింద నిధులను విడుదల చేస్తారు. అర్హులైన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు. దీనికోసం విశాఖపట్నం జిల్లా అధికార యంత్రాంగం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. బహిరంగ సభ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.

షెడ్యూల్ ఇదే..
ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు వైఎస్ జగన్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు . 11.05 నిమిషాలకు ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్కు వెళ్తారు. 11.05 నుంచి 11.15 గంటల వరకు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు.
అనంతరం వైఎస్సార్ వాహన మిత్ర ఫొటో ఎగ్జిబిషన్ను తిలకిస్తారు. వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్లో పాల్గొంటారు.
11.40 గంటల నుంచి 11.45 గంటల వరకు లబ్ధిదారుల ప్రసంగాలు ఉంటాయి.

అరగంట పాటు ప్రసంగం..
దీని తరువాత 11.45 నుంచి 11.47 గంటల వరకు వాహన మిత్ర అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. 12.17 నిమిషాల వరకు ప్రసంగం కొనసాగుతుంది. 12.20 నుంచి వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. 12.30 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు. 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు. 1.20 గంటలకు గన్నవరం బయలుదేరుతారు.

వాహనమిత్ర కింద..
అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ గల డ్రైవర్లకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని పొందడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 7వ తేదీ లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను ఇదివరకే విడుదల చేసింది.












Click it and Unblock the Notifications