వైజాగ్ వైపు సర్కార్ అడుగులు: మరో భారీ నిర్మాణానికి: గ్రేహౌండ్స్ హిల్పై: గ్రేటర్ విశాఖకు బాధ్యతలు
విశాఖపట్నం: రాష్ట్ర పరిపాలనా రాజధానిగా అవతరిండానికి సిద్ధమౌతోన్న సాగర నగరం విశాఖపట్నంలో మరో భారీ నిర్మాణానికి పూనుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ ఆమోదం తెలిపిన కొద్దిరోజుల్లోనే ఈ నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అతిథిగృహం భవనం సముదాయాన్ని నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదనలను రూపొందించే బాధ్యతను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంఆర్డీఏ)కు అప్పగించింది.

కాపులుప్పాడ వద్ద..
విశాఖపట్నం శివార్లలోని కాపులుప్పాడ వద్ద గల గ్రేహౌండ్స్ హిల్పై దీన్ని నిర్మించనున్నారు. ఇక్కడే 30 ఎకరాల స్థలాన్ని గ్రేటర్ విశాఖ అధికారులు ఇదివరకే గుర్తించారు. జిల్లా కలెక్టర్ వినయ్చంద్ నేతృత్వంలో ఏర్పాటైన గ్రేటర్ విశాఖ అధికారుల కమిటీ ఈ మేరకు ఓ ప్రతిపాదనలను రూపొందించింది. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. దీనిపై తాజాగా సీఎంఓ అధికారులు అనుమతించినట్లు సమాచారం.

గెస్ట్హౌస్ నిర్మణానికి ఆర్ఎఫ్పీ ఆహ్వానం
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి లభించిన వెంటనే గ్రేటర్ విశాఖ అధికారులు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ)లను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. త్వరలోనే బిడ్డింగుల ప్రక్రియను చేపట్టబోతున్నట్లు సమాచారం. ఈ అతిథిగృహం నిర్మాణ వ్యయం ఎంత? డిజైన్లు ఎలా ఉండబోతున్నాయి? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బిడ్డింగుల ప్రక్రియ పూర్తయిన వెంటనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని అంటున్నారు.

ప్రముఖుల కోసం..
విధి నిర్వహణలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చే కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులకు నివాస వసతిని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అతిథిగృహాన్ని నిర్మించడం సాధారణం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో లేక్వ్యూ గెస్ట్హౌస్, మంజీరా అతిథిగృహం వంటి ఉండేవి. విభజన అనంతరం అలాంటి సౌకర్యం ఏపీలో లేదు. రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు విజయవాడలోని హోటళ్లలో బస చేస్తున్నారు. దానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది.

ప్రొటోకాల్లో భాగంగా..
ప్రొటోకాల్లో భాగంగా విశాఖపట్నం శివార్లలోని కాపులుప్పాడ వద్ద ఈ అతిథిగృహాన్ని నిర్మించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం గెస్ట్హౌస్ నిర్మాణ ప్రక్రియ ప్రతిపాదనల దశలో ఉందని, ప్రీ బిడ్డింగ్ సమావేశాన్ని నిర్వహించామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీ కోటేశ్వర రావు తెలిపారు. ఈ ప్రాజెక్టు మాస్టర్ప్లాన్ను రూపొందించడానికి ప్రీబిడ్డింగ్ సమావేశాన్ని నిర్వహించామని అన్నారు. అత్యాధునిక వసతులతో ఈ గెస్ట్హౌస్ను నిర్మిస్తామని అన్నారు.

కాపులుప్పాడ సమీపంలో
రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహం నిర్మాణం కాపులుప్పాడ పరిసరాల్లో నిర్మితం కాబోతుండటంతో.. ఇక సచివాలయాన్ని కూడా ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. గ్రేహౌండ్స్ హిల్ పరిసరాల్లో ఖాళీ స్థలాలు పెద్ద ఎత్తున ఉండటం వల్ల సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ భవన సముదాయాలను ఇదే ప్రాంతంలో నిర్మించడానికి అవకాశం ఉందని అంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన సచివాలయ భవన నిర్మాణం ఇక్కడే ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications