విశాఖ మెట్రో రైలుకు టెండర్లు: నిర్మాణం వ్యయం రూ.8,300 కోట్లు..
ఏపి లో శర వేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖ నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం వేగంగా అడుగులు పడుతున్నా యి. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్ (పీపీపీ) విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. ఆసక్తి వ్యక్తీకరణలో ఎంపికైన సంస్థల నుంచి ఇప్పుడు టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్సీ)కు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో విజయవాడ తో పాటుగా విశాఖలో మెట్రో రైల్ నిర్మాణానాకి కేంద్రం విభజన బిల్లులో హామీ ఇచ్చింది. అయితే, విజయవాడలో ఢిల్లీ మెట్రో రైల్ తో ప్రభుత్వం ఒప్పందం సైతం కుదుర్చుకుంది. అయితే, అక్కడ మెట్రోకు ఫీజబులిటీ లేదనే కొర్రీతో ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక, విశాఖ లో మెట్రో రైలు నిర్మాణ వ్యయం రూ. 8,300 కోట్లు గా రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ వ్యయాన్ని రెండు విభాగాలుగా విభజించారు. సివిల్ నిర్మాణాల వ్యయం 51 శాతం వాటాగా రూ. 4,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఎలక్ట్రో మెకానికల్ పనుల వ్యయం 49 శాతం వాటాగా రూ. 4,100 కోట్లను డెవలపర్ భరించాల్సి ఉంది. పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పు చేస్తుంది.

ముందుకొస్తున్న సంస్థలు..
విశాఖ మెట్రో రైల్ను మూడు కారిడార్లలో మొత్తం 42.55 కిలోమీటర్ల మేర చేపట్టాలని నిర్ణయించారు నగరంలో మెట్రో విస్తరణలో భాగంగా మొత్తం 38 స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 83 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 12 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించి కేటాయించాలని డిసైడ్ అయ్యారు. మెట్రో డెవలపర్కు పదేళ్ల కాలానికి నిర్వహణకు రూ. 820 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుకు ఎస్జీఎస్టీ కింద రూ. 527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డెవలపర్కు రీయింబర్స్మెంట్ చేయనుంది. ఈ ప్రాజెకుకు సంబంధించి ఇప్పటికే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించగా..
వచ్చిన దరఖాస్తుల్లో ఐదు సంస్థలను ఎంపిక చేసింది. వీటిల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్, ట్రైల్ (టాటా)ప్రాజెక్టు, షాపూర్జీ పల్లోంజీ, ఎస్సెల్ ఇన్ ఫ్రా, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ల ఉన్నాయి. ఈ ఐదు సంస్థల నుంచి బిడ్లు దాఖలు ప్రతిపాదనలను, రాయితీ ఒప్పంద పత్రాలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం అనుమతించింది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 4,200 కోట్ల రుణం మంజూరు చేసేందుకు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు ముందుకు వచ్చింది. దీంతో..ఎంతో కాలంగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న విశాఖ మెట్రో కల సాకారం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications